హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాక, ఇప్పుడు ఉద్యోగం రాలేదని అధికారులు అంటే దీనికి బాధ్యులెవరు? అని దివ్యాంగుల సంస్థ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణభవన్లో బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్రెడ్డితో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురుకుల నియామకాల్లోని స్పెషల్ క్యాటగిరీలో గందరగోళం జరిగిందని ఆరోపించారు. భానుప్రియ అనే అభ్యర్థికి సీఎం రేవంత్రెడ్డి ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని, ఆమెకు పీజీ టీ, జేఎల్, టీజీటీ ఉద్యోగాలు వచ్చాయని, హియరింగ్ క్యాటగిరీలో జాబ్ ఇచ్చారని, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత హియరింగ్ క్యాటగిరీలో పరీక్షలు చేసి ఆమెకు అర్హత లేదని అధికారులు చెప్పారని, దీనికి బాధ్యులెవరని నిలదీశారు.
ప్రభుత్వం చేసిన తప్పిదానికి ఆమె మానసిక క్షోభతో కుమిలిపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులకు అండగా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9,210 పోస్టులతో గురుకులాల నోటిఫికేషన్ ఇచ్చిందని, కాంగ్రెస్ వచ్చాక ఫలితాలు విడుదల చేసి, నియామకాల పేరుతో హడావుడి చేసిందని చెప్పారు. స్పెషల్ క్యాటగిరీ, డిసేబుల్డ్ క్యాటగిరీ కింద జాబ్ ఇచ్చే వారికి ముందుగానే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలని, సీఎం రేవంత్రెడ్డి నియామకపత్రాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దివ్యాంగుల కోటాలో రిజెక్ట్ చేసినవారికి పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.