హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి తొలిసారి జిల్లాల పర్యటనలో ప్రైవేటు దవాఖాన ప్రారంభోత్సవానికి రానుండటంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి భగ్గుమన్నారు. సీఎంకు ఆరు నెలల తర్వాతైనా జిల్లాల్లో పర్యటించడానికి తీరిక దొరికిందని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం తన తొలి పర్యటనను ప్రైవేటు దవాఖాన ప్రారంభోత్సవానికి పెట్టుకోవటం ఆశ్చర్యంగా ఉన్నదని తెలిపారు.
ఎంజీఎంను సందర్శించాలనే సోయిలేకుండా, కార్పొరేట్ దవాఖానను ప్రారంభించనుండటం బాధ కలిగించిందని వెల్లడించా రు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ వెంటిలేటర్పై ఉన్నదని ఆరోపించారు. ప్రభుత్వ దవాఖానలు దయనీయస్థితిలో ఉన్నాయని విమర్శించారు. ఎంజీఎం దవాఖానలో ఐదు గంటల పాటు కరెంట్ లేకపోవటంతో రోగులు విలవిలలాడారని గుర్తుచేశారు. ఓరుగల్లు పర్యటన సందర్భంగా సీఎం ముందు పలు డిమాండ్లు ఉంచుతున్నామని రాకేశ్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం ఉంచుతారా? లేదా? చెప్పాలి అని డిమాండ్ చేశారు.
హనుమకొండ, జూన్ 27: రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని హనుమకొండలో ఆయన పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ హెచ్చరించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్ చంద్ర, ఉపాధ్యక్షుడు కంజర్ల మనోజ్ కుమార్, రూరల్ జిల్లా కోఆర్డినేటర్ లంక రాజగోపాల్, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కలకోట్ల సుమన్, గొల్లపల్లి వీరస్వామి, జిల్లా కార్యదర్శి హర్ష మధు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్, జూన్ 27(నమస్తే తెలంగాణ): వరంగల్లో ప్రభుత్వం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి నిర్మాణ కాలపరిమితిని పొడిగించి పనులు చేపట్టారు. ఇప్పుడు ఆ గడువు కూడా సమీపిస్తున్నా పనుల్లో వేగం పుంజుకోవటం లేదు. పనులు పూర్తి కావాలంటే మరో ఆరు నెలలు గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరేందుకు రహదారులు, భవనాల (ఆర్అండ్బీ) శాఖ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు సమాచారం. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో 24 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపట్టింది. 56.39 ఎకరాల్లో మొదట రూ.1,116 కోట్ల అంచనా వ్యయంతో 1,750 పడకల కెపాసిటీతో పనులు మొదలు పెట్టింది.