Peddi Sudarshan Reddy | వరంగల్ : బీఆర్ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే.. గాంధీ భవన్ కూడా కూలుతది అని కాంగ్రెస్ సర్కార్కు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఇటుక ఒక్కటి కదిపినా.. అక్కడ గాంధీ భవన్ను కూడా కూలుతది.. చట్టం ఎవరికైనా సమానమే అని ఆయన స్పష్టం చేశారు. వరంగల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీఆర్ఎస్ కార్యాలయాలను కూల్చే కుట్ర చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ హనుమకొండ జిల్లా కార్యాలయాన్ని టార్గెట్ చేసి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వమే డబ్బులు కట్టించుకుని గుర్తింపు పొందిన పార్టీలకు స్థలాలను కేటాయించే జీవోను కేసీఆర్ తీసుకురాలేదు. కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని గుర్తించాలి. మీ గాంధీ భవన్ ఎక్కడ్నుంచి వచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోండి. స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా గాంధీ ట్రస్టు ఏ స్ఫూర్తితో ఏర్పడ్డదో ఆత్మవిమర్శ చేసుకోండి. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయానికి ఏది వర్తిస్తే హైదరాబాద్లోని గాంధీ భవన్కు కూడా అదే వర్తిస్తది. ఇక్కడ ఒక్క ఇటుక పెల్ల కదిపిన అక్కడ గాంధీ భవన్ కూలుతుది.. చట్టం ఎవరికైనా సమానమే అని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎన్ఆర్ఆర్ భవన్ కాంగ్రెస్ పార్టీకి ఎలా వచ్చిందో ఆలోచించాలి. యూత్ కాంగ్రెస్లో నేను పని చేస్తున్నప్పుడు ఎన్ఆర్ఆర్ భవన్ వద్ద నిలబడి పని చేయించాను. ఎన్ఆర్ఆర్ భవన్ అంటే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం. అక్కడ ప్రత్యేకంగా మున్సిపల్ పార్కు, ఫౌంటేన్ ఉండేది. ఆ ఫొటోలను కూడా పంపిస్తాం. పార్టీ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించడానికి గుర్తింపు గల రాజకీయ పార్టీలకు నామినల్ రేట్కు భూమిని విక్రయిస్తారు. కాంగ్రెస్, టీడీపీ కార్యాలయాలు కూడా ప్రభుత్వ జీవోలకు అనుగుణంగానే వచ్చాయి. కేసీఆర్ మాత్రమే ఇవ్వలేదు. ఉమ్మడి ఏపీలో కూడా పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించారు. 2008లో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్లోని బోయిన్పల్లి మెయిన్ రోడ్డులో 10 ఎకరాలు రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్కు ఏ విధంగా ల్యాండ్ కేటాయించబడిందో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక ఎకరా వంద కోట్ల విలువ చేసే బోయిన్పల్లిలో 10 ఎకరాలు ఏ జీవో ద్వారా అయితే అధికారికంగా ఇచ్చిందో ఆ జీవోను అనుసరించి పార్టీ జిల్లా కార్యాలయాలకు స్థలం ఇచ్చింది. బీఆర్ఎస్ కార్యాలయాల్లో ఒక్క ఇటుక పెల్ల కదిపితే.. గాంధీ భవన్ ఒక్కటే కాదు.. ప్రభుత్వ రేటు ప్రకారం తీసుకున్నా కార్యాలయాలన్నింటినీ టచ్ చేస్తాం.. గుర్తుంచుకోవాలి అని పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.