Patolla Karthik Reddy | హైదరాబాద్ : నేను పార్టీ మారను.. మా అమ్మ పార్టీ మారదు.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మారాం. కానీ రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం మారలేదు. పార్టీలు మారే సంస్కృతి కూడా మాకులేదు. తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మీద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై కొట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలపై కేసులు ఎక్కడా నమోదు కాలేదు అని కార్తీక్ రెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. రాహుల్ గాంధీనేమో పార్టీ ఫిరాయింపులు సరికాదు అని చెబుతారు. రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. టీ పీసీసీ.. ఏఐసీసీలో భాగం కాదా..? అని కార్తీక్ రెడ్డి ప్రశ్నించారు.