Manne Krishank | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన తుగ్లక్ను తలపిస్తున్నది అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
మంత్రి జూపల్లి కృష్ణా రావు రాష్ట్రంలో సోమ్ డిస్టలరీస్కు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చి మళ్లీ రద్దు చేయడం వెనుక ఉన్న అవినీతిపై లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సోమ్ డిస్టలరీలకు అనుమతుల రద్దు తాత్కాలికమా, శాశ్వతమా ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ మీద విచారణ జరపాలి. సోమ్ డిస్టిలరీస్ నుండి కాంగ్రెస్ పార్టీకి ముడుపులు అందినాయి. దీని మీద పూర్తి ఆధారాలు ఇచ్చాం.. ఇప్పుడు సోమ్ డిస్టిలరీస్ సంస్థను తాత్కాలికంగా నిలిపివేశారు. సోమ్ డిస్టిలరీస్ సంస్థకు ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయడమే కాదు, ఆ సంస్థకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వారిపై, ఆ కంపెనీ నుంచి ఎవరెవరికి కమిషన్లు అందయనే దానిపై విచారణ జరగాలని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.
నకిలీ మద్యం తయారు చేస్తుందనే పేరు సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి ఉంది. గతంలో ఈ కంపెనీ యజమానులు జైలు పాలయ్యారు. మధ్యప్రదేశ్లో ఈ కంపెనీ లైసెన్స్ను జప్తు చేశారు. ఎనిమిది శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తే, అందులో ఏడు శాంపిళ్లు కల్తీ మద్యం అని తేలింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ. 575 కోట్ల రుణాలు తీసుకుని ఇప్పటి వరకు కట్టలేదు. కోర్టులో కేసు నడుస్తోంది. పర్మిషన్స్ లేకుండా మద్యం తయారు చేస్తే దాన్ని సీజ్ చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా వందల ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మించారు. గూగుల్ మ్యాప్ ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సీజ్ చేసింది. ఇవన్నీ బయటపెట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రెస్ నోట్ జారీ చేసి 24 గంటల్లోనే వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించింది.
ఒకరు ఇసుక, ఒకరు బియ్యం, ఒకరు లిక్కర్ ఇట్లా పోటీ పడి మరీ పందికొక్కుల లెక్క రాష్ట్రం మీద ఎగబడి దోచుకుంటున్నరు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆరు హామీలు ఎంత వరకు చేశారంటే మేడిగడ్డ, ఫోన్ ట్యాపింగ్ అంటూ డైవర్షన్ చేస్తున్నారు. ఆర్టీసీ లోగో మీద వాళ్లే లీకులు ఇస్తున్నారు, అది పోస్ట్ చేసిన వాళ్ల మీద కేసులు పెడుతున్నారు అని మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.