Manne Krishank | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్లోని మంత్రులందరూ ఏది అడిగినా తమకు తెలియదు, సంబంధం లేదు అంటున్నారు. ఇది ప్రజా పాలనా..? తుగ్లక్ పాలనా..? తెలంగాణలో ఫేక్ ప్రభుత్వం నడుస్తోంది అనడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రుల పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు.. కేవలం డమ్మీలుగా ఉన్నారా..? వారి నిర్ణయాలు డమ్మీగా ఉన్నాయా..? అధికారులు మంత్రులకు చెప్పడం లేదా..? లేదా తప్పించుకునేందుకు మంత్రులే సాకులు చెబుతున్నారా..? అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని మన్నె క్రిశాంక్ నిలదీశారు.
నకిలీ బీర్లు తయారు చేసే సోమ్ డిస్ట్రీలరీస్ అనుమతులు ఇచ్చిన విషయం తనకు తెలియదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతుండు. రాష్ట్ర హోం మంత్రికి సమాచారం లేకుండానే పోలీసు శాఖ వారు రాత్రి పదిన్నర వరకు సిజిటన్లపై ఆంక్షలు పెడుతున్నారా..? ఈ అంశంపై మీడియాలో, సోసల్ మీడియాలో చర్చ జరిగే తప్పుడు న్యూస్ అని సీఎం, మంత్రులు చెబుతున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఆంక్షల పోస్టర్లు పెడుతారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన సోషల్ మీడియాలో పెడుతారు. ఇవి ఇట్ల ఉంటే.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోట్ల రూపాయాల ఆర్టీసీ టికెటింగ్ కాంట్రాక్ట్ గురించి సమాచారం లేదంటున్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తలేదు. తుగ్లక్ పాలనలా కనబడుతుంది. ఏ విషయం అడిగినా మాకు తెల్వదని మంత్రులు అంటున్నారు. మరి ఎలా నడుస్తుంది ప్రభుత్వం అని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.