Manne Krishank | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలేమోకానీ ఆరు కుంభకోణాలు మాత్రం చేసిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ప్రతి శాఖలో దేన్నీ వదలకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సాంలతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమ సొంత ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని, అధికారాన్ని అడ్డుపెట్టుకొంటున్నారని విమర్శించారు. ఇసుక, బియ్యం, మద్యం, బూడిద ఇలా ప్రతి దాంట్లోనూ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా మరో కుంభకోణానికి పాల్పడ్డారని, టికెట్ మిషన్ల కొనుగోలు, వాటి నిర్వహణపై టెండర్ సంస్థతో కుమ్మక్కయ్యారని ఆధారాలను బయటపెట్టారు. ఆర్టీసీలో ఒక పెద్ద టెండర్ గోప్యంగా ఉంచి పెద్ద స్కాం చేశారని మండిపడ్డారు. ‘ఆర్టీసీలో యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్ జారీచేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసి, ప్రయోగాత్మకంగా అమలుచేయగా విజయవంతమైంది.
దాని కోసం ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం(ఏఎఫ్సీఎస్)లో ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మెషీన్ (ఐటీఐఎం)లను ప్రవేశపెట్టేందుకు 2023 ఫిబ్రవరి 1న ఆన్లైన్ విధానంలో టెండర్లు పిలిచారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఆన్లైన్ టెండర్లను రద్దు చేసింది. ఆ టెండర్లు ఎందుకు రద్దు చేశారు?’ అని ప్రశ్నించారు. 2024 జనవరి 11న ఇంటలెక్చువల్ టికెట్ ఇష్యూ మిషన్ (ఐటీఐఎం)కు ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్ టెండర్లు ఎందుకు పిలిచారని నిలదీశారు. ఫిజికల్గా బస్భవన్లో టెండర్లు వేస్తే ఎన్ని టెండర్లు వచ్చాయి? ఎవరు ఎంత కోట్ చేశారు? అన్న విషయాలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఆఫ్లైన్ టెండర్లకు కూడా నెల రోజుల్లోనే 14 సవరణలు తీసుకురావటంలో మతలబు ఏమిటని నిలదీశారు. చివరికి చలో మొబిలిటీ అనే కంపెనీకి 13,200 ఐటీఐఎం మెషీన్ల కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కో మెషీన్కు జీఎస్టీతో కలిపి రూ.16,829 అవుతుందని చలో మొబిలిటీ సంస్థ టెండర్ దాఖలు చేసిందని, ఈ లెక్కన ఐటీఐఎంలకు కలిపి మొత్తం రూ.22.21 కోట్ల వ్యయం అవుతుందని చెప్పారు. ఈ మొత్తం చెల్లింపునకు ఆర్టీసీ అధికారులు టికెట్ల ప్రాతిపదికన ఐదేండ్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు చెప్పారు.
ఒక్కో టికెట్కు జీఎస్టీతో కలిపి 4.0072 పైసలు చెల్లిస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు 50 లక్షల టికెట్లు జారీ అయితే ప్రతి టికెట్ కమిషన్ నేరుగా ఆ సంస్థకు వెళ్తుందని, ఇలా దీని ద్వారా ఎన్ని కోట్లు ఆ సంస్థ నుంచి లబ్ధిపొందుతున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ లెకల ప్రకారం ప్రతి రోజు 52 లక్షల టికెట్లు అమ్మితే 365 రోజులు.. ఐదేండ్లు.. అంటే ఐటీఐఎంల నిర్వహణ కోసమే ఆ సంస్థకు కనీసం రూ.43 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇలా ఇంత పెద్ద ప్రా జెక్టును ఎందుకు గోప్యంగా ఉంచారని నిలదీశారు. చేసిన సవరణలు కంపెనీకి లాభమా? మంత్రికి లాభమా? చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ తరఫున కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. వివరాలు, టెండర్లు ఖరారు చేసిన విధానాన్ని ప్రశ్నించి అక్రమ టెండర్లపై పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.