Telangana | ప్రజా పాలనలో పోలీస్ల పహారాలు, నిర్బంధాలు ఎందుకు అని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటూ బీఆరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై ఈ అంక్షలు ఎందుకు అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. రాకేశ్ రెడ్డి సహా 40 మంది మంది ముఖ్య కార్యకర్తల నిర్బంధించారు. దీంతో ప్రభుత్వం తీరుపై రాకేశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరు నెలల పాలనకే ఇంత అభద్రతాభావమా.. ఇంతటి అరాచకమా? అని ఏనుగుల రాకేశ్రెడ్డి మండిపడ్డారు. తమకు కొట్లాడటం కొత్తకాదని తెలిపారు. కేవలం నిర్మాణాత్మక సూచనలను ప్రజల కోణంలో విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహా సగం కేబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓ ప్రైవేటు హాస్పిటల్ ఓపెనింగ్ కోసం ఎగవేసుకుని వస్తున్నారని.. అయినప్పటికీ వరంగల్కు సీఎం వస్తున్నాడన్న వాతావరణమే ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు.
తెలంగాణ భవన్లో తన ప్రెస్ మీట్ తర్వాతే సీఎం పర్యటనలో మార్పులు వచ్చాయని ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించేదాక సీఎం హోదాలో ఎలా పర్యటించాలో ఆయనకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కాకతీయ కళాతోరణాన్ని అధికారిక చిహ్నం నుంచి తొలగించడంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాకతీయ కళా తోరణం రాచరిక దర్పం అన్న వ్యాఖ్యలు ఓరుగల్లు ప్రజలను తీవ్రంగా బాధించాయని ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి ఆ మాటలు వెనక్కి తీసుకొని, ఓరుగల్లు ప్రజలకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ దాటేలోగా కాకతీయ తోరణం తొలగింపుపై స్పష్టత ఇవ్వాలన్నారు. లేకపోతే, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులంతా రేవంత్ రెడ్డి ఇంటిముందు టెంటు వేసుకొని ధర్నా చేయాలని సూచించారు. లేదంటే మీ క్యాంప్ ఆఫీస్ల ముందు ప్రజలు కుర్చుకుంటారని చెప్పారు. కడుపు మీద కొట్టినా ఓర్చుకుంటాం. కానీ, మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.