రుణమాఫీపై రైతుల అభిప్రాయాలను తెలుసుకుని ప్రజలకు తెలియజేయడానికి కొండారెడ్డిపల్లెకు వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్య అని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. ఈ చర్యతను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ సంపూర్ణంగా చేయకుండానే బుకాయిస్తున్నారని దేవీప్రసాద్ విమర్శించారు. 31వేల కోట్ల రుణమాఫీని 17వేల కోట్లకు తగ్గించి.. రైతులకు దగా చేసిందని అన్నారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలుపుతుంటే ప్రతిదాడులు చేస్తూ ప్రశ్నించే గొంతుకలను పోలీస్ల ద్వారా నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ(ఇందిరమ్మ రాజ్యం)రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు.
మహిళలపై జరిగిన దాడులపై మహిళా కమిషన్ స్పందించక పోవడం అన్యాయమని దేవీప్రసాద్ అన్నారు. వెంటనే సరిత, విజయారెడ్డిలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి.. జర్నలిస్ట్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన జనరంజన, ప్రజాపాలన అని ప్రచారం చేస్తున్న మేధావులు.. రాష్ట్రంలో అన్ని వర్గాల హక్కులు ప్రభుత్వం హరిస్తుంటే నోరు మెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.