Dasyam Vinay Bhasker | వరంగల్ : తెలంగాణలో ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. వరంగల్లో దాస్యం వినయ్ భాస్కర్ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు.
గత ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టి అమలు కాని ఆరు గ్యారెంటీలతో, 420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏడు నెలల నుంచి ప్రజా పాలన పేరుతో ప్రతీకార పాలన చేస్తోంది. ఎన్నికల హామీలను నెరవేర్చాలని మంత్రులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలకు జవాబు చెప్పలేక, బీఆర్ఎస్ పార్టీ పైన లేనిపోని అభాండాలు వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వినయ్ భాస్కర్ మండిపడ్డారు.
కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించారు. నీళ్లు, నిధులు తీసుకొచ్చారు. నియామకాలు చేపట్టారు. రైతాంగానికి కాళేశ్వరం ద్వారా వేల ఎకరాలకు నీళ్లు అందించాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాం. రైతుబీమా, రైతుబందు ఇచ్చాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రైతుల హామీలు అమలు కాలేదు. నిరుద్యోగ భృతి అమలు చేయలేదు. చివరికి కల్యాణలక్ష్మి చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయి. సీఎంఆర్ఎఫ్ ద్వారా లక్షలాది మందికి కోట్లాది ఫండ్ ఇచ్చాం. ఇప్పుడు అసలు ఇవ్వడం లేదు. ఇవాళ మా పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాల్లు మేడిగడ్డ, విద్యుత్ కొనుగోళ్ల, టెలిఫోన్ ట్యాపింగ్ అని కాలయాపన చేశారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు న్యాయబద్దంగా కేటాయించిన స్థలాలపై కన్నేశారు. ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ కార్యాలయాలు వేదికయ్యాయని చెప్పి, వాటిని కూల్చేందుకు కాంగ్రెస్ పార్టీ పని పెట్టుకుంది అని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.