Balka Suman | కాళేశ్వరం బ్యాక్ వాటర్తోనే పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయన్నది అవాస్తవమని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. గతంలో 1983, 1986, 1996, 2003, 2016 సంవత్సరాల్లో ప్రాణహిత గోదావరి నదుల్లో వరద వచ్చి పంట నష్టం జరిగిందన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, అప్పటి కేసీఆర్ సర్కార్ ని బద్నాం చేయడానికి కాంగ్రెస్ నాయకులు చేసిన విషప్రచారమే కాళేశ్వరం బ్యాక్ వాటర్ అని మండిపడ్డారు.
ఇప్పటికే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో సగానికి పైగా డ్యామ్ లు ఎండిపోయి సాగునీరు లేక రైతాంగం ఇబ్బంది పడుతుందని బాల్క సుమన్ తెలిపారు. లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ సర్కార్ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకుల అవివేకం, అజ్ఞానంతో పంట పొలాలకు సాగు నీళ్లు ఇవ్వడం చాతకాకనే ముంపు గ్రామాలు, పంట పొలాలు అంటూ ఎప్పటి లాగానే డైవర్ట్ డ్రామాలాడుతున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు.
కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్న వివేక్పై బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న ఎన్నికల సందర్భంలో చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు తమరు ఇచ్చిన 30 హామీలతో కూడిన మేనిఫెస్టోలో గోదావరి వరదలు రాకుండా కరకట్టలు కడతానని ప్రజలకు మాట ఇచ్చి మభ్యపెట్టింది మర్చిపోయావా? అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంకా తమరి మొద్దు నిద్ర వీడడం లేదా? అని విమర్శించారు. మొన్న కోటపల్లిలోని కొన్ని గ్రామాల్లో పర్యటించినప్పుడు కనీసం భూమిపై నడవడానికి కూడా ఇష్టపడక గ్రామస్తులతో చివాట్లు తిన్న నువ్వా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడేదని ఎద్దేవా చేశారు.