Balka Suman | హైదరాబాద్ : తెలంగాణలోని నిరుద్యోగుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాడి మసైపోతది అని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. నిరుద్యోగుల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
నిరుద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచుతున్న తీరు స్పష్టంగా ఈ ఏడు నెలల పరిపాలనలో కనబడుతోంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలతో పాటు అశోక్ నగర్, దిల్ సుఖ్నగర్లో ఉన్న కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ నిరుద్యోగులను రెచ్చగొట్టి నాటి ప్రభుత్వానికి వతిరేకంగా కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఉద్యోగాల భర్తీ చేపడుతామని మాటిచ్చి మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేతగా, రేవంత్కు ముఖ్యమంత్రిగా, బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీగా, రియాజ్కు గ్రంథాలయ చైర్మన్గా ఉద్యోగం వచ్చింది అని బాల్క సుమన్ గుర్తు చేశారు.
గ్రూప్ -1 మెయిన్స్కు 1:100 పిలవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గ్రూప్-2లో 2 వేలు, గ్రూప్-3లో 3 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఆ హామీ నిలబెట్టుకోవడం లేదు. 25 వేలతో మెగా డీఎస్సీ వేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి రెచ్చగొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 వేలకు మరిన్ని కలిపి మమ అనిపించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని గొప్పగా చెప్పించారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది అని బాల్క సుమన్ మండిపడ్డారు.
నిరుద్యోగులు నిరాహార దీక్షలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. నిరుద్యోగులపై లాఠీ ఛార్జ్, అరెస్టులు, కేసులు పెడుతున్నారు. కోచింగ్ నిర్వాహకులను భయపెట్టిస్తున్నారు. నిరుద్యోగుల వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లను కూడా బెదిరిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. నిరుద్యోగులను వాడుకొని పబ్బం గడుపుకుని అధికారంలోకి వచ్చాక వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 32 వేల ఉద్యోగాల భర్తీకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఆగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అన్నట్టు ప్రవర్తించారు. 32 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చినట్లు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లడం బంద్ పెట్టి.. నిరుద్యోగుల హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కాంగ్రెస్ పార్టీని నిట్టనిలువునా కూల్చబోయేది నిరుద్యోగులే అనే మాట గుర్తుంచుకోవాలి. దుర్మార్గపు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను ఆలకించి, నెరవేర్చే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చకపోతే నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలలో మాడి మసి గాక తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగుల ఆర్తనాదాలు, ఆందోళనలు కళ్లారా చూస్తున్నాం. వారి నిరసన జ్వాలకు బలైపోక తప్పదు. నిరుద్యోగులతో ప్రభుత్వ పెద్దలు మాట్లాడాలి అని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.