Subsidy Current | హైదరాబాద్, జూలై4 (నమస్తే తెలంగాణ): సెలూన్లు, లాండ్రీ షాపుల ఉచిత విద్యుత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారుల కోసం తీసుకొచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం నేడు ఉత్త ముచ్చటగానే మారిపోతున్నది. సబ్సిడీ బిల్లుల చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, విద్యుత్తు అధికారుల వేధింపులతో లబ్ధిదారులు సతమతం అవుతున్నారు. విద్యుత్తు పంపిణీ సంస్థల అధికారులు వివిధ కొర్రీలతో వృత్తిదారులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నారు.
ఫలితంగా మళ్లీ పదేండ్లకంటే ముందురోజులను తలచుకొని ఆవేదన చెందుతున్నారు. అత్యంత వెనకబడిన నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతను అందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెలూన్లు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని తీసుకొచ్చింది. 2021 ఏప్రిల్ 1 నుంచి దీనిని అమలు చేస్తున్నది. పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 71 వేల మంది రజకులు, 36 వేల మంది నాయీబ్రాహ్మణులు లబ్ధి పొందుతున్నారు.
లబ్ధిదారులకు సొంత కమర్షియల్ విద్యుత్తు కనెక్షన్ను సైతం ప్రభుత్వం అందించింది. ప్రభుత్వం ప్రతి నెలా 250 యూనిట్ల విద్యుత్తు వినియోగానికి అయ్యే బిల్లును విద్యుత్తు బిల్లులో సబ్సిడీ కింద మినహాయించేంది. 250 యూనిట్లకు మించి వాడిన యూనిట్లకు మాత్రమే లబ్ధిదారులు బిల్లును చెల్లించుకునేవారు. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చాక అధికారులు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 250 యూనిట్ల చార్జీని విద్యుత్తు బిల్లులో సబ్సిడీగా మాత్రమే చూపుతున్నారు.
మొత్తం బిల్లులో మాత్రం సబ్సిడీ నగదును మినహాయించకుండా, దానినీ కలిపే చూపుతున్నారు. దీంతో ఒక్కో యూనిట్పై వేలల్లో బిల్లులు పెండింగ్ ఉన్నట్టు చూపుతున్నది. ఇదే అదనుగా క్షేత్రస్థాయి విద్యుత్తు అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. బిల్లుల కోసం బెదిరింపులకు దిగుతున్నారని, లేదంటే విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సమస్యపై బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు చెప్పినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన చెందుతున్నారు.
లాండ్రీ, సెలూన్ల లబ్ధిదారుడి పేరిట మాత్రమే విద్యుత్తు కనెక్షన్ ఉండాలనే నిబంధన ఉన్నది. ఈ నేపథ్యంలోనే అద్దె షాపులను నిర్వహిస్తున్న లాండ్రీ, సెలూన్ యజమానులు సదరు ఇంటి యాజమానితో చేసుకున్న ఒప్పంద, లీజు, రెంటల్ అగ్రిమెంట్ ధ్రువపత్రాలను సమర్పించి ఉచిత విద్యుత్తు యూనిట్కు కనెక్షన్ను తీసుకున్నారు. అంతేకాదు లబ్ధిదారుడు తన యూనిట్ను నిలుపుదల చేసినా, షాపును వేరే ప్రాంతానికి తరలించినా ఆ విషయాన్ని తప్పక బీసీ సంక్షేమశాఖకు, తెలంగాణ డిస్కమ్కు తెలిపి, కొత్తగా మారిన చోట ఆ మీటర్ కనెక్షన్ను పొందే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం విద్యుత్తు అధికారులు మాత్రం షాపుల చిరునామాలను మార్చుకున్నా ఉచిత విద్యుత్తు సదుపాయాన్ని మాత్రం ఇవ్వడం లేదు. అధికారుల తీరుతో ఉచిత విద్యుత్తుకు దూరమవుతున్నామని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్యుత్తు కనెక్షన్ కోసం గతంలో ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేవారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త కనెక్షన్లే ఇవ్వకపోగా, ఏకంగా దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటుచేసిన సైట్నే రద్దు చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రజకులు, నాయీబ్రాహ్మణులకు ఇస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్కు రూ.59.70 కోట్లను, నాయీబ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్కు రూ.50 కోట్లను బడ్జెట్లోనూ ప్రతిపాదించింది. గత జనవరిలో రూ.79.85 కోట్లను విడుదల చేస్తూ ఆదేశాలనూ జారీ చేసింది. కానీ ఇప్పటివరకు అందులో నుంచి ఒక్కరూపాయి కూడా ఫెడరేషన్లకు చెల్లించలేదు. కేవలం ఆదేశాలకే ప్రభుత్వం పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే బిల్లుల చెల్లింపు కోసం విద్యుత్తు అధికారులు లబ్ధిదారులను వేధింపులకు గురిచేస్తున్నారు.
ఉచిత విద్యుత్తు పథకం లబ్ధిదారులపై విద్యుత్తు అధికారుల వేధింపులను ప్రభుత్వం నిరోధించాలి. 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదల చేయాలి. షాపు నిర్వహణ ప్రదేశాన్ని మార్చకున్న చోటుకు విద్యుత్తు మీటర్లను మార్చాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కొత్త కనెక్షన్లను కూడా ఈ ప్రభుత్వం మంజూరు చేయాలి.
– కొండూరు సత్యనారాయణ, రజక సంఘాల సమితి ముఖ్య సలహాదారు