Dasyam Vinay Bhasker | వరంగల్ : బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యాలయాల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించారని ఆయన స్పష్టం చేశారు. వరంగల్లో వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో సీసీఎల్ఏ ద్వారా మా పార్టీ కార్యాలయానికి ల్యాండ్ అలాంట్ అయింది. వరంగల్ అర్బన్ కలెక్టర్, తహసీల్దార్ నిబంధనల మేరకు భూమిని నేటాయించారు. నాటి నుంచి నేటి వరకు మేం ప్రభుత్వ విధానాల ప్రకారం పార్టీ కార్యక్రమాలకే ఆ కార్యాలయాన్ని వినియోగించాం. పార్టీ కార్యాలయానికి సంబంధించి నిన్న లిఖిత పూర్వకంగా అధికారులకు ఆధారాలు సమర్పించాం. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించారు. అది కూడా పార్కు స్థలమే. ఏ పార్టీ కార్యాలయాలు కూడా కమర్షియల్ అవసరాలకు వినియోగించవు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కమర్షియల్గా కిరాయికి ఇచ్చారు అని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు.
2009 నుంచి మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఏ రోజు కూడా ఇతర పార్టీ నాయకులు, కార్యాయలాలపై ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. అన్ని పార్టీల కార్యకర్తల వ్యక్తిగత సమస్యలను పరిష్కరించాను. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ కింద వేల మందికి చెక్కులు ఇచ్చాం. ఇదే కాకుండా కరోనా సమయంలో కాంగ్రెస్ శ్రేణులు అనారోగ్యంతో ఉన్నపపుడు ఇంజెక్షన్లు ఉచితంగా ఇచ్చాం. ఎన్నికలప్పుడే పార్టీలు.. ఆ తర్వాత అందర్నీ సమానంగా చూశాం. ఆ బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా ఇటువంటి ఎమ్మెల్యేను చూడలేదు. కక్షపూరితంగా బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతూ, భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. చివరకు నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. కేసులకు భయపడే వ్యక్తి వినయ్ భాస్కర్ కాదు అని తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలన్ని ఖాళీ చేయాలన్న చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు దృష్టి సారించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. మేం మంజూరు చేసిన పనులను మీరు పర్యవేక్షిస్తూ మీరు మంజూరు చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ ఏడు నెలల కాలంలో నియోజకవర్గం అభివృద్ధికి ఒక్క పైసా కూడా తీసుకురాలేదు. మా పార్టీ కార్యాలయం జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నాం. మీరు ఇచ్చిన నోటీసలకు కూడా డిప్యూటీ కమిషనర్ వద్ద సమాధానం ఇచ్చాం. పై అధికారులు వివరణ కోరితే వారికి కూడా ఇస్తాం. ఈ పార్టీ కార్యాలయం శ్రేణులకే కాదు.. ప్రజలకు ఉపయోగపడే విధంగా పని చేస్తుంది. ఈ కార్యాలయాన్ని ప్రజలే కాపాడుకుంటారు. అక్రమ కేసులు పెట్టినా పర్వాలేదు. అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. న్యాయ పోరాటం చేస్తాం. ప్రజా పాలనలో ప్రజా సమస్యలు పరిష్కరించండి. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అమలు చేయండి. ప్రజలకు నచ్చే మెచ్చే విధంగా మేం పాలన అందించాం. అంతకుమించి పరిపాలిస్తే మంచిది.. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అని దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు.