KCR | హైదరాబాద్ : మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 2004, 2009లో మంత్రిగా సేవలందించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంతా ఆయనను డీఎస్ అని పిలిచేవారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని జూబ్లీహిల్స్లోని ఆయన ఇంట్లోనే ఉంచారు. సాయంత్రం నిజామాబాద్ ప్రగతినగర్లోని ఆయన నివాసానికి పార్థీవదేహాన్ని తరలించనున్నారు. డీఎస్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.