తెలంగాణ అవతరణ వేడుకలు జరుపుకొంటున్న వేళ బీఆర్ఎస్కు అపురూప విజయం దక్కింది. ప్రలోభాలు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాతరేసిన పాలమూరు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఉద్యమ పార్టీకే పట్టం కట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు.
తిరుగులేని విజయం సాధిస్తామని బీరాలు పలికిన సీఎం రేవంత్రెడ్డికి సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులే కోలుకోలేని షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనపై అనతికాలంలో ప్రజల్లో పెల్లుబికిన వ్యతిరేకతకు ఈ ఫలితం అద్దం పడుతున్నది.
మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మేం 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం. ఈ గెలుపును ఎవరూ ఆపలేరు.
– ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్
మహబూబ్నగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కారు షెడ్డుకు వెళ్లింది.. బీఆర్ఎస్ పని అయిపోయింది.. ఇక ప్రతిపక్షానికే పరిమితమైంది.. అని అహంకారంతో విర్రవీగిన హస్తం పార్టీ నేతలకు స్థానిక ప్రజానిధులు కర్రుకాల్చి వాతపెట్టారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ గులాబీ పార్టీకి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శాసనమండలి ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఘోరంగా ఓడించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీకి తొలి ఎన్నికల్లోనే ఓటుతో బుద్ధిచెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డిపై 109 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారి, కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఉమ్మడి జిల్లాలో 1,439 మంది ఓటర్లు ఉండగా మార్చి 28న జరిగిన పోలింగ్లో 1,437 మంది ఓటు వేశారు. ఏప్రిల్ 2న ఉప ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కౌంటింగ్ జరిగితే నష్టమని కాంగ్రెస్ భావించింది. కోడ్ అమల్లో ఉన్నందున కౌంటింగ్ వద్దని ఎన్నికల కమిషన్ను ఆశ్రయించడంతో జూన్ రెండుకు వాయిదా వేసింది. ఆదివారం మహబూబ్నగర్ బాలుర జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోలైన 1,437 ఓట్లలో 21 ఓట్లు చెల్లనివిగా, మిగిలిన 1,416 ఓట్లలో 709 ఓట్లను కోటాగా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యం ఓట్లలోనే బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డికి 762 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డికి 653, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్గౌడ్కు ఒక్క ఓటు పోల్ అయింది. కోటా కన్నా ఎక్కువ ఓట్లు సాధించడంతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డిని విజేతగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్ ప్రకటించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేసినా స్థానిక ప్రజాప్రతినిధులు లొంగలేదు. తామంతా కేసీఆర్ వెంటే ఉంటామని నొక్కి చెప్పారు. అధికారం చేపట్టాక వచ్చిన తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్కు ప్రజాప్రతినిధులు ఝలక్ ఇచ్చారు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కూడా కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కే పది ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఆరు నెలల్లోనే అధికార పార్టీపై ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమవుతున్నది.
బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బులాబీ గెలుపు సంబురాలు మిన్నంటాయి. ఎమ్మెల్సీగా గెలుపొంది బయటికి రాగానే నవీన్ కుమార్రెడ్డిని పూలవర్షంతో ముంచెత్తారు. కౌంటింగ్ కేంద్రం నుంచి న్యూటౌన్ వరకు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్కుమార్రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి అభినందించారు. గెలుపు ధ్రువపత్రాన్ని తీసుకున్నాక నవీన్రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రధాన నేతలతో కలిసి హైదరాబాద్కు వచ్చారు. కేసీఆర్ను కలిసి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. తన విజయాన్ని కేసీఆర్కు కానుకగా అందించినట్టు నవీన్కుమార్రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల హక్కుల కోసం పోరాడుతానని, తనను ఓటు వేసి గెలిపించిన స్థానిక ప్రజాప్రతినిధులందరికీ పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో జరిగిన శాసనమండలి ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం ఆ పార్టీ శ్రేణులను షాక్కు గురి చేసింది. మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న మన్నె జీవన్రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ మారారు. తొలుత ఎంపీ టికెట్ ఇస్తారని ఊహగానాలు వెలువడ్డా.. ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని భావించారు. చివరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రావడంతో ఆ పార్టీకి అభ్యర్థి లేక జీవన్రెడ్డిని పోటీలో దింపారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జీవన్రెడ్డి ఫార్మా కంపెనీ అధినేతల్లో ఒకరు. ధనబలం చూసి ఆయనకు టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. కాంగ్రెస్లో సీనియర్లను కాదని జీవన్రెడ్డికే టికెట్ ఇవ్వడంపట్ల పార్టీ శ్రేణుల్లో ఆసంతృప్తి వ్యక్తమైంది. అయినా, ఎమ్మెల్సీగా జీవన్రెడ్డిని సీఎం రంగంలో దింపారు. ఎమ్మెల్సీగా పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో (200 తక్కువ కాకుండా మెజారిటీతో) గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్కే షాక్ఇచ్చారు.
‘తెలంగాణ స్వరాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నవీన్రెడ్డిని గెలిపించిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తున్నాం.. ఈ విజయాన్ని అమరవీరులకు అంకితమిస్తున్నామని’ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ప్రకటించారు. కౌంటింగ్ హాల్ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్రెడ్డితో కలిసి బయటికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. స్వరాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఘనత బీఆర్ఎస్దే అని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావం రోజు మళ్లీ బీఆర్ఎస్ను విజయం వరించిందన్నారు. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఇదే స్ఫూర్తితో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధుల ఆదరణ కాంగ్రెస్కు తగ్గిందని చెప్పొచ్చు. అధికార పార్టీకి 20 ఓట్లు పడగా.. బీఆర్ఎస్కు 30 ఓట్లు పోలైనట్టు అధికారుల ద్వారా తెలిసింది. హస్తం పార్టీ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డికి కంటే గులాబీ పార్టీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డికి 10 ఓట్లు ఎక్కువగా వచ్చినట్టు సమాచారం.
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ‘సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో బీఆర్ఎస్ సాధించిన గెలుపు.. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. ఇది అధికార పార్టీ ప్రలోభాలకు నిలువునా పాతరేసిన ఎన్నిక అని, ఇది ఆరునెలల్లోనే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన ఫలితం అని తెలిపారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి విజయంపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. నాడైనా.. నేడైనా.. ఏనాడైనా.. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ మాత్రమే.. ఈ గడ్డకు శ్రీరామరక్ష అని మరోసారి తేల్చిచెప్పిన శుభతరుణమిది అని పేర్కొన్నారు.
విజయం సాధించిన నవీన్కుమార్రెడ్డికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక పార్టీ నాయకుడికి, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ గెలుపు మా పైన బాధ్యతలు మరింత పెంచింది. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నాం’ అని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ ఈ అద్భుత గెలుపు హర్షణీయమని, గులాబీ పార్టీ గెలుపు కోసం శ్రమించిన బీఆర్ఎస్ కుటుంబసభ్యులందరికీ మరోసారి గుండెల నిండా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, అభినందనలు అని కేటీఆర్ పేర్కొన్నారు.
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గెలుపునకు కృషిచేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.