హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): నేటినుంచి అమలుకానున్న మూడు కొత్త చట్టాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారనున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం తెచ్చిన ఈ చట్టాలతో ప్రజల ప్రాథమిక హకులకు విఘాతం కలుగుతుందని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ నమోదుకు 15 రోజులు, పోలీస్ కస్టడీకి 14 రోజులకు బదులు 90రోజుల దాకా అవకాశమిచ్చారని, తద్వారా బాధితుడికి అన్యాయం జరుగుతదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా తెచ్చిన చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్లో బీఆర్ఎస్ లీగల్సెల్ ఇన్చార్జి సోమభరత్కుమార్తో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లను కేంద్రం రద్దు చేసి కొత్తగా భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ పేర్లతో కొత్త చట్టాలు తెచ్చిందని, హిందీ, సంస్కృతంలో పెట్టిన ఈ పేర్లు దక్షిణ భారత రాష్ర్టాల భాషకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. తమపై బలవంతంగా హిందీని రుద్దడం ఏమిటని ప్రశ్నించారు. చట్టాల మార్పు బిల్లులను నిరు డు ఆగస్టులో మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కొత్త చట్టాలపై విసృ్తతంగా పరిశీలించి అనేక మంచి సూచనలు చేసినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. దాదాపు 160 మంది పార్లమెంట్ సభ్యులను బయటకు పంపి బిల్లును కేంద్రం పాస్ చేయించుకున్నదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ న్యాయవాదులు, మేధావులు, సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
మోదీ తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలతో అనేక మంది రైతులు చనిపోయారని, నెలల తరబడి ఆందోళన చేయడం వల్ల వాటిని రద్దు చేసి మోదీ క్షమాపణ చెప్పారని వినోద్కుమార్ గుర్తుచేశారు. ఈ కొత్త చట్టాల అమలును కూడా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. 15 రోజులపాటు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసేలా మార్పులు చేశారని, పోలీసుల చేతికే న్యాయ వ్యవస్థను అప్పగించారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే స్టేషన్ బెయిల్ను కొందరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు దుర్వినియోగం చేస్తున్నారని, బాధితుడే హింసకు గురవుతున్నాడని మండిపడ్డారు. కొత్త చట్టాలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలని డిమాండ్ చేశారు. వాటికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలుచేస్తామని చెప్పారు.
కొత్త చట్టాలతో దేశం తిరోగమనంలోకి వెళ్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ లీగల్ సెల్ ఇన్చార్జి సోమ భరత్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. అమలులో ఉన్న చట్టాలను మార్చాలంటే బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్స్, మేధోవర్గం అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పారు. బ్రిటీష్ వాళ్లు సైతం చట్టం చేసే ముందు బార్ అసోసియేషన్లతోపాటు వర్తక సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారని, మోదీ పాలన బ్రిటీష్వాళ్ల కంటే దారుణంగా తయారైందని విమర్శించారు.
దేశ రక్షణ కవచాన్ని బలహీనపర్చేలా చట్టాలున్నాయని, ఇవి సుదీర్ఘ అనుభవం ఉన్న న్యాయవాదులకు సైతం అర్థం కావడం లేదని చెప్పారు. వీటి అమలుద్వారా ఈస్ట్ కంపెనీ, బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు పునరావృతమవుతాయన్నారు. ఇప్పటికే కోటీకిపైగా కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయని, కొత్త చట్టాలతో మరో కోటి కేసులు పెరిగే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. వందల సంఖ్యలో జైళ్లను పెంచినా ఇకపై సరిపోవని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకురాలు ఎన్ లలితారెడ్డి పాల్గొన్నారు.