హైదరాబాద్ : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో(Congress) చేరడంపై ఆ పార్టీలో అగ్గిరాజు కుంటున్నది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై అసహనంతో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని జీవన్ రెడ్డి నివాసంలో ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు మా అందరికి మార్గదర్శకులు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వం నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పది సంవత్సరాలు కాంగ్రెస్ జెండాను భుజాన మోశారు. పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం నడవడం కోసం వారి ఆలోచనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామని భట్టి తెలిపారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియార్టీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యమిస్తూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ తీరుపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రేపు అసెంబ్లీ దగ్గర అన్ని మాట్లాడుతానని మంత్రులకు తేల్చి చెప్పారని, కౌన్సిల్ చైర్మన్ అపాయింట్మెంట్ సైతం కోరినట్లు సమాచారం.