బాల్కొండ, జూలై 4: వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలు అమలు చేస్తామని చెప్పి.. ఉచిత బస్సు తప్ప ఇతర ఏ హామీ కూడా సక్రమంగా అమలు చేయడలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం ముగింపు సందర్భంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై కాంగ్రెస్ చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని ఆయన కొట్టిపారేశారు.
‘ఏ గుడి మెట్లు అయిన ఎక్కుదామని, మీరు చేసిన ఆరోపణలు రుజువు చేయగలరా?’ అని సవాల్ విసిరారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ కోసం అధికార పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 70 శాతం రైతులకు రుణమాఫీ చేశామని, మిగిలిన వారు మళ్లీ కొత్తగా తీసుకున్న వారి డాటా ప్రభుత్వం దగ్గర ఉంటుందని, కానీ వారికి రూ.2లక్షల రుణమాఫీ చేయకుండా విధివిధానాలు అనడం హాస్యాస్పదమని అన్నారు. రైతుబంధు సక్రమంగా ఇవ్వడం లేదని, ఊరూరా మీటింగ్లు పెట్టి రైతుబంధులో కోతలు విధించే పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
సుదీర్ఘ అనుభవమున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం సరికాదని ఎమ్మెల్యే వేముల అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించిందని, అయినా నాలుగు రోజులు కూడా అధికారం లేకుండా ఉండలేకపోయారని విమర్శించారు. ఎవరి ఒత్తిడితోనో, తాత్కాలిక లబ్ధి కోసమో పార్టీని వీడటంతో జిల్లా ప్రజలు ఈసడించుకుంటున్నారని తెలిపారు. ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.