ATR Safari | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : సఫారీ సమయంలో పులులు, ఇతర వన్యప్రాణులు అకస్మాత్తుగా ఎదురైనప్పుడు పర్యాటకులు చాకచక్యంగా వ్యవహరించాలని అటవీ అధికారులు సూచించారు. ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. జంతువుల సంతతి కోసం మూడు నెలల విరామం తర్వాత అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) సఫారీ తిరిగి ఆదివారం పునఃప్రారంభమైంది. ఇటీవల తెలుగు రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో పులులు జనసంచారంలోకి రావడం, తిరుపతిలో చిరుతలు చిన్నారులపై దాడులు చేసిన ఘటనలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సఫారీ సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఏటీఆర్లో సఫారీ ఫరహాబాద్ ద్వారం నుంచి జంగల్ ప్రారంభమై, నల్లమల్ల అడవుల్లోని వృక్ష, జంతుజాలం గురించి పర్యాటకులకు వివరిస్తూ ముందుకు సాగనున్నదని అధికారులు పేర్కొన్నారు. పర్యాటకులకు పలు జంతువుల గురించి, వాటి బారినపడకుండా తప్పించుకొనే మార్గాలపై అవగాహన కల్పించారు. ఉద్దేశ పూర్వకంగా ఏ జంతువు అడవి నుండి బయటకు రాదని, అడవిలో మనుషుల ప్రమేయం పెరగడం, బయటి ప్రాంత ఒత్తిడి వల్లే ఇలా జరుగుతుందని ఫారెస్ట్ సీనియర్ అధికారి మాధవ్రావు వివరించారు. ముఖాముఖిగా ఎదురుపడితే దాడి చేసే అవకాశాలు ఎకువగా ఉంటాయని చెప్పారు. అలాంటి సందర్భంలో రెండు చేతులు పైకి లేపి గట్టిగా అరవాలని, అప్పుడు తనకంటే ఎకువ ఎత్తు ఉన్న జంతువు ఉందన్న భ్రమలో పకకు పోయే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. చిరుతపులి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకి తిరిగి పరుగెత్తడం, లేదా పొదల చాటున దాకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు. పారిపోతే అటాక్ చేస్తుందని కూడా కచ్చితంగా చెప్పలేమని, అయితే , అది దాడి చేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో ఎంత పరుగెత్తినా దాని వేగం ముందు నిలవలేమని మాధవ్రావు వివరించారు.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) స్టేటస్ టైగర్స్ కో-ప్రెడేటర్స్ అండ్ ప్రే ఇన్ ఇండియా- 2022 నివేదిక ప్రకారం తెలంగాణలో 21 పులులు ఉన్నాయని, ఇవి ప్రధానంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్)లో ఉన్నాయని ఏటీఆర్ అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు. 2018 జనాభా లెకల ప్రకారం.. ఏటీఆర్లో14 పులులు ఉన్నాయన్నారు. అది ప్రస్తుతం 21కి పెరిగిందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్(ఎన్ఎస్టీఆర్)వైపు ఏటీఆర్ నుండి చాలా పులుత వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు.