Vote | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల హడావుడి పెరిగిపోతున్నది. ఈసారి ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదని అన్ని పార్టీల నేతలు తెగ తంటాలు పడుతున్నారు. తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగి ఉండి జీవనోపాధి కోసమో లేక వేరే అవసరాల కోసమో ప్రాంతాలకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. వారికి ఫోన్లు చేసి తమకు ఓటు వేసేందుకు రావాలని పిలుస్తున్నారు. అందుకయ్యే ఖర్చులన్నీ తామే భరిస్తామని ప్రాధేయపడుతున్నారు. పలు నియోజకవర్గాల అభ్యర్థులు ఏకంగా వాహనాలను పెట్టి చెన్నై, ముంబై, షోలాపూర్ లాంటి దూరప్రాంతాలకు వలస వెళ్లినవారిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరికొందరు అభ్యర్థులు ఈ పనిని తమ అనుచరులకు అప్పగించి ఓట్ల కోసం ఫాలోఅప్ చేస్తున్నారు. దీంతో ఎవరికి ఓకే చెప్పాలో తెలియక ఆయా ఓటర్లు సతమతమవుతున్నారు. మరోవైపు నల్లగొండ, మహబూబ్నగర్, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లోని నియోజకవర్గాల అభ్యర్థులు ఓట్ల కోసం హైదరాబాద్లోని కాలనీల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిన్నారు. ఆయా జిల్లాకు చెందిన ఎంతో మంది ప్రజలు హైదరాబాద్తోపాటు నగర శివారు కాలనీల్లో స్థిరపడటంతో వారి ఓట్ల కోసం పలువురు అభ్యర్థులు ఇప్పటికే ప్రత్యేక బస్సులను బుక్ చేసినట్లు సమాచారం.