Party Defection | హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపులను ప్రోత్సహించడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఒకవైపు సొంత పార్టీలోనే ఆగ్రహ జ్వాల రేగుతుండగా, మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు ‘కాలం చెల్లిన’ కారణాలు చెప్పి తమ పనులను సమర్థించుకోజూస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఆనాడు బీఆర్ఎస్ చేర్చుకోలేదా? ఇప్పుడు మేం చేర్చుకుంటే తప్పేమిటి? అని లాజిక్లు లాగుతున్నారు. ఇక్కడే వారి అవగాహనా రాహిత్యం బట్టబయలవుతున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘2014లో తెలంగాణ కొత్తగా రాష్ట్రంగా ఏర్పడింది. అది కూడా ఆంధ్రా ప్రాంత నేతల అభిమతానికి భిన్నంగా. చిన్న రాష్ర్టాలు రాజకీయ అస్థిరతకు మారుపేరు, తెలంగాణ కూడా అట్లే విఫలమవుతుంది అని నిరూపించడానికి ఆనాడు ఆంధ్ర నేతలు కంకణం కట్టుకున్నారు. వారి కుట్రలను విఫలం చేయడానికి నాడు కేసీఆర్ కొందరిని చేర్చుకోక తప్పలేదు. అదొక ముందు జాగ్రత్త. దాన్ని నేటి పరిస్థితితో పోల్చడానికి వీలే లేదు” అని బీఆర్ఎస్ ముఖ్యనాయకుడు ఒకరు పేర్కొన్నారు.
‘బెర్లిన్ గోడవు బద్దలు కాలేదా? తెలుగు రాష్ర్టాలను కలుపుతం అనే వ్యాఖ్యలు 2014కు ముందే వినిపించాయి. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బలరాం నాయక్ (ప్రస్తుత మహబూబాబాద్ ఎంపీ కూడా) నర్సంపేటలో తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మళ్లీ గెలిపించకపోతే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తాం.. అని బహిరంగంగానే ప్రజలను బెదిరించారు. 63 మంది సభ్యులతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, దాన్ని కూల్చాలనే బలమైన కుట్రలు వెలుగుచూశాయి. ‘ఓటుకు నోటు’ కేసే అందుకు ఉదాహరణ. తెలంగాణను అస్థిరపరిచి మళ్లీ ఆంధ్రాలో కలిపే ప్రయత్నాలు ఢిల్లీలో జరుగుతున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి కూడా సమాచారం అందింది. వీటన్నింటి దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వాన్ని సుస్థిర పరచుకుంటే తప్ప పాలనపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొన్నది. అందువల్ల కేసీఆర్ ఆనాడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అప్పటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి పొంతనే లేదు.
జీవన్రెడ్డి చెప్పినట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ ఉన్నది. వామపక్షాలు, మజ్లిస్ కూడా దానికి మద్దతిస్తున్నాయి. ఇక ఫిరాయింపులను ప్రోత్సహించడంలో అర్థమేమున్నది?’ అని సీనియర్ పాత్రికేయుడొకరు ప్రశ్నించారు. 2014లో బీఎస్పీ నుంచి గెలిచిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కోనేరు కోనప్ప పార్టీ శాసనసభాపక్షాన్ని బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా విలీనం చేసినట్టే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చట్టప్రకారం పార్టీ శాసనసభా పక్షాన్ని బీఆర్ఎస్లో విలీనం చేయడం, ఆ సమయంలో కోర్టు సైతం దాన్ని స్వేచ్ఛాయుత, సమ్మతిహిత విలీనంగా వ్యాఖ్యానించిన ఉదంతాన్ని న్యాయ నిపుణుడొకరు గుర్తుచేస్తున్నారు. “అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితిలో చాలా తేడా ఉన్నది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు అప్పట్లో అమలులో లేదు.
ఈ తీర్పు ఏడాది క్రితమే అమల్లోకి వచ్చి, లా ఆఫ్ది ల్యాండ్గా మారింది. అందువల్ల ఇప్పుడు పార్టీ మారడం కాంగ్రెస్ పార్టీకే కాదు, గోడదూకుతున్న ఎమ్మెల్యేలకు సైతం ప్రాణసంకటంగా మారుతుంది’ అని ఆయన స్పష్టంచేశారు. పార్టీ మారే ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలైన 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రజాప్రతినిధులకు ఒక హెచ్చరికలాంటిదని ఆయన హెచ్చరించారు. ‘అయినా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. వారి సభ్యత్వం రద్దయ్యేలా చర్యలు తీసుకుంటామని స్వయంగా పేర్కొన్నది. ఫిరాయింపులకు వ్యతిరేకంగా పాంచ్న్యాయ్లో ప్రకటన చేయడమే కాదు, ఏకంగా రాహుల్గాంధీ పలు వేదికలపై సుద్దులు వల్లించారు. అలాంటివారు ఇప్పుడు తమ చర్యలను ఎలా సమర్థించుకోగలరు?’ అని సీనియర్ నాయకుడొకరు ప్రశ్నించారు. ఏదేమైనా ఇప్పుడు గతంలో లాగా ఫిరాయిస్తామంటే కుదరదని, ఫిరాయించినవాడు 3 నెలల్లో అనర్హుడు అవుతాడని పేర్కొన్నారు.