Palakuri Ashok | హైదరాబాద్ సిటీబ్యూరో/ఎల్బీనగర్, జులై 3 ( నమస్తే తెలంగాణ ): ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు, అశోక అకాడమీ డైరెక్టర్ అశోక్ ధ్వజమెత్తారు. బుధవారం తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు. ‘ప్రజాస్వామిక పరిపాలన అంటే ఇదేనా? 30లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నరు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ఈ దౌర్భాగ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నం. కాంగ్రెస్ను గద్దెనెక్కించేందుకు 5వేల కిలో మీటర్లు ఎందుకు తిరిగినమా? అని ఇప్పుడు బాధపడుతున్నా. ఈ దొంగ ప్రభుత్వానికి నూకలు లేకుండా చేయాలి.
ఎవరి సంకనాకి ఏటా 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిండ్రు? ఒక్క పోస్టు కూడా పెంచకుండా భర్తీ ఎలా సాధ్యం?. మోతీలాల్ 9 రోజులు దీక్ష చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పోలీసులతో మమ్మల్ని అణిచివేయాలని చూస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేదాకా దీక్ష విరమించే ప్రసక్తే లేదు’ అని అశోక్ ఉద్వేగంగా ప్రకటించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద మంగళవారం దీక్ష ప్రారంభించిన అశోక్ను పోలీసులు చైతన్యపురిలోని ఆయన నివాసానికి తరలించిన విషయం తెలిసిందే. దీక్ష కొనసాగుతుందని ఆయన బుధవారం వీడియో విడుదల చేశారు. సీఎం రేవంత్రెడ్డి చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేది దౌర్భాగ్యపు పనులు అని విమర్శించారు. నిరుద్యోగుల గొంతు కోసేందుకే ఈ ప్రభుత్వం వచ్చిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు, అధికార దాహం, పదవుల ధ్యాస తప్ప కాంగ్రెస్కు వేరేది లేదని విమర్శించారు. బల్మూరి వెంకట్లాంటి దొంగలు అడ్డుపడి నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అన్నీ కలిపి ముష్టిలా రెండు వేల పోస్టులు కూడా వేయదని, నిరుద్యోగులు మేల్కోవాలని, రేపటి టీజీపీఎస్సీ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓ వర్గం మీడియా నిరుద్యోగులకు మద్దతు తెలపడం లేదని, ఇదేం వైఖరని ప్రశ్నించారు. పోలీసులు తనను ఇంట్లో నిర్బంధించారని, తీవ్రవాదుల కంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.