Andhra Pradesh | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్న పరిశ్రమలపై కన్నేసినట్టు తెలుస్తున్నది. తెలంగాణతో ఒప్పందాలు చేసుకొని ఇంకా పనులు ప్రారంభించని కంపెనీలు, విస్తరణ బాటలో ఉన్న పరిశ్రమలను తమవైపునకు తిప్పుకొనేందుకు పొరుగు రాష్ట్రం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ ప్రక్రియ లో ఆ రాష్ర్టానికి చెందిన ఓ ప్రముఖ మంత్రి ఆయా పరిశ్రమ వర్గాలను సంప్రదిస్తున్నట్టు వెల్లడించాయి. తెలంగాణ ఆఫర్ చేస్తున్న రాయితీలకన్నా తాము అధికంగా ఇస్తామని పెట్టుబడులను తమవైపు తిప్పుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారు.
డిపార్ట్మెంట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండ స్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తు తం మూడు బిలియన్ డాలర్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల(ఎఫ్డీఐ)తో తెలంగాణ రాష్ట్రం గుజరాత్ తరువాత రెండో స్థానంలో నిలిచిం ది. 2023 ఆర్థిక సంవత్సరంలో 1.3 బిలియ న్ డాలర్ల ఎఫ్డీఐలు రాగా, ఈసారి అంతకు రెట్టింపు పెట్టుబడులు వచ్చాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్ ఐ-పాస్ విధానం ద్వారా 2014-23 మధ్య రూ. 2,60,028 కోట్ల విలువైన పెట్టుబడికి సంబంధించిన ఒప్పందాలు జరిగినట్టు, తద్వారా 17.54 లక్షల ఉద్యోగావకాశాలు లభించనున్నట్టు 2023 ప్రభుత్వ ప్రగతి నివేదికలో వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో దాదాపు 45 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి.
రాష్ర్టానికి వచ్చిన పెట్టుబడుల్లో ఎక్కువగా ఐటీ, ఫార్మా రంగానికి చెందినవే ఉన్నాయి. ఇందులో కొన్ని కొత్త కంపెనీలు కాగా, మరికొన్ని ఇప్పటికే ఉన్న కంపెనీలు.. తమ విస్తరణ ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించాయి. సహజంగా కంపెనీ పెట్టుబడి పెట్టేముందు ఆర్థిక అంశాలతోపాటు ఇతరత్రా అనేక అంశాలను ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తాయని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యం గా రాయితీలు, ఇతరత్రా ప్రోత్సాహకాల విషయంలో ప్రభుత్వంతో బేరసారాలు సాగించడం కంపెనీలకు అలవాటని, ఒక ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్నాక కూడా ఇతర రాష్ర్టాలు, ఇతర ప్రాంతాల్లో అవకాశాలను పరిశీలిస్తాయని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పం దం చేసుకున్న కంపెనీల్లో చాలా వరకు కంపెనీలు ఇంకా గ్రౌండ్ కావాల్సివుందన్నారు. అయితే, ఒప్పందం చేసుకొని ఇంకా పనులు చేపట్టని కంపెనీల వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.
కంపెనీల ప్రతినిధులతో చర్చలు
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రధానంగా ఐటీ, పారిశ్రామికరంగంపై దృష్టి కేంద్రీకరించింది. వ్యవసాయం తరువాత పారిశ్రామికరంగంలోనే అత్యధికంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉండటంతో సాధ్యమైనన్ని ఎక్కువ కంపెనీలను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయించాలని అక్కడి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందు లో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను ఆకర్షించే పని ప్రారంభించింది.
ఆ ప్రక్రియలోనే తెలంగాణతో ఒప్పందం చేసుకున్న ఓ బడా కంపెనీ ప్రతినిధులతో ఏపీకి చెందిన ఓ ప్రముఖ మంత్రి చర్చలు జరిపినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సులభతర అనుమతులు ఇవ్వడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకన్నా ఎక్కువ రాయితీలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది.
కియాను చూపుతూ..
ఏపీలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటర్స్ కార్పొరేషన్ తెలుగుదేశం హయాంలోనే తమ పరిశ్రమను నెలకొల్పింది. దక్షిణ కొరియాకు చెందిన కియా మోటర్స్ అదే దేశానికి చెందిన హ్యుందా య్ మోటర్ కంపెనీకి అనుబంధ కంపెనీ. హ్యుందాయ్ కంపెనీ తెలంగాణలో టెస్టిం గ్ ట్రాక్ను నిర్మిస్తున్నది. ప్రస్తుతం హ్యుం దాయ్ కంపెనీ పెట్టుబడిపై ఎటువంటి అనుమానాలు లేనప్పటికీ ఇతర కంపెనీ లు మన రాష్ర్టానికి రావాల్సినవి పొరుగు రాష్ట్రంతో కూడా చర్చలు జరుపుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు సాగి స్తూ సమీప భవిష్యత్తులో విస్తరించాలని భావిస్తున్న కంపెనీలను తమ రాష్ర్టానికి రప్పించుకునేలా ఏపీ కృషి చేస్తున్నదని పేర్కొంటున్నారు. హైదరాబాద్కు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి వచ్చినప్పటికీ భారత్లో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే విదే శీ కంపెనీలు ఇక్కడ లభించే సౌకర్యాలు, ప్రోత్సాహకాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో మన రాష్ర్టానికి ఏపీతో పోటీ ఏర్పడే అవకాశం ఉందని చెప్పవచ్చు.