Pawan Kalyan | హైదరాబాద్ : జనసేన చీఫ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రానికి వెళ్లనున్నారు. దీంతో పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏపీ పోలీసులు పవన్ పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు.
వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కల్యాణ్.. శనివారం ఉదయం 7 గంటలకు మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయల్దేరనున్నారు. ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఆయన చేరుకోనున్నారు. గంటన్నర పాటు కొండగట్టు పుణ్యక్షేత్రంలో పవన్ గడపనున్నారు. ఆంజనేయస్వామికి పవన్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కొండగట్టు నుంచి మాదాపూర్కు రోడ్డు మార్గంలో తిరిగి రానున్నారు. సాయంత్రం 4.30కు మాదాపూర్ చేరుకోనున్నారు. శనివారం రాత్రికి హైదరాబాద్లోనే డిప్యూటీ సీఎం పవన్ బస చేయనున్నారు.
పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడంతో పవన్ కల్యాణ్ జూన్ 26న వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. 11 రోజుల పాటు నిష్టగా ఈ దీక్షను పవన్ కల్యాణ్ పాటించనున్నారు. పసుపు రంగు దుస్తుల్లో ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఉన్న పవన్ కల్యాణ్ ఫొటోలు చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ దీక్ష దుస్తుల్లో ఉన్న పవన్ కల్యాణ్ చెప్పులు వేసుకుని కనిపించడం చర్చనీయాంశంగా మారింది.