Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష ఇప్పుడు వివాదాస్పదంగా మారేలా కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడంతో పవన్ కల్యాణ్ జూన్ 26న వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. 11 రోజుల పాటు నిష్టగా ఈ దీక్షను పవన్ కల్యాణ్ పాటించనున్నారు. పసుపు రంగు దుస్తుల్లో ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఉన్న పవన్ కల్యాణ్ ఫొటోలు చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ దీక్ష దుస్తుల్లో ఉన్న పవన్ కల్యాణ్ చెప్పులు వేసుకుని కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
ముందుగా వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ చెప్పులు వేసుకుని ఉండటాన్ని గమనించిన శ్రీరెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రశ్నించింది. బీజేపీని మెప్పించడానికా? చెప్పులతో దీక్షలు.. వాట్ ఏ హిందూ ఫాలోవర్ అంటూ ట్వీట్ చేసింది. దీనికి రెండు పగలబడి నవ్వే ఎమోజీలను కూడా జత చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన పోస్టు సోషల్మీడియాలో తెగ వైరల్గా మారింది. చెప్పులు వేసుకుని దీక్ష చేయడంతో పవన్ కల్యాణ్పై వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. హిందూమతం గురించి గొప్పగా చెప్పుకునే పవన్ కల్యాణ్కు చెప్పులు వేసుకుని దీక్ష చేయకూడదనే విషయం కూడా తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. కాగా, ఈ నెల 29న పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లనున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో శనివారం ఉదయం అంజన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పురాణాల ప్రకారం దుర్గా మాతకు ఏడు ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. అంధకాసురుడు, రక్తబీజుడు, శంభునిశంభు.. వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది. అమ్మవారి రూపం వరాహం ముఖంతో ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది. చేతుల్లో పాశం, నాగలి, శంఖ చక్రాలు వంటి ఆయుధాలను పట్టుకుని ఉంటుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింహం అమ్మవారి వాహనాలుగా పురాణాల్లో చెబుతుంటారు.