అమరావతి: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల సీఎం నారా చంద్రబాబు నాయడు (CM Chandrababu Naidu) సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డీఎస్ మంత్రిగా, ఎంపిగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.
డీఎస్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్, కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.