హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మరో సలహాదారును నియమించుకున్నది. ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్రాజును మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల సలహాదారుడిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవలే ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ను నీటిపారుదల వ్యవహారాల సలహాదారుడిగా నియమించగా, తాజాగా శ్రీనివాసరాజును నియమించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సలహాదారులపై నిత్యం విమర్శలు గుప్పించిన రేవంత్రెడ్డి, తాము అధికారంలోకి వస్తే సలహాదారుల వ్యవస్థను లేకుండా చేస్తామని అనేక సందర్భాల్లో ప్రకటించారు. సలహాదారుల నియామకాన్ని ఓ నేరంగా చిత్రీకరిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ను సలహాదారుగా నియమించినప్పుడు కోర్టులో సవాల్ చేస్తానని హెచ్చరించారు. ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సలహాదారుల నియామకాన్ని చేపడుతున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం నియమిస్తున్న సలహాదారులకు, వారికి అప్పగిస్తున్న బాధ్యతలకు ఎటువంటి సంబంధం లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా వేం నరేందర్రెడ్డిని, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల సంక్షేమ వ్యవహారాల కోసం మహ్మద్ అలీ షబ్బీర్ను, ప్రోటోకాల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్కు హర్కర వేణుగోపాల్ను సలహాదారులుగా నియమించింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు. బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వెంటనే జితేందర్రెడ్డిని కూడా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్దాస్ను నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ఏపీ నీటి పారుదలశాఖ ప్రిన్స్పల్ సెక్రటరీగా సుదీర్ఘకాలం పనిచేశారు.
ఆదిత్యనాథ్ హయాంలోనే తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలించుకుపోయారనే విమర్శలున్నాయి. దుమ్ముగూడెం, పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అమలులో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. మన రాష్ట్రంలో అనేకమంది నీటిపారుదల రంగ నిపుణులు ఉండగా ఏపీకి చెందిన రిటైర్డ్ అధికారిని నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఏపీలో చంద్రబాబునాయుడు గెలిచిన వెంటనే ఇక్కడ ఆదిత్యనాథ్దాస్ నియామకం జరగడంతో చంద్రబాబు సూచనల ప్రకారమే ఆయన నియామకం జరిగిందనే వాదనలు ఉన్నాయి. ఇక, హర్కర వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో ప్రొటోకాల్ విభాగం సభ్యుడిగా ఉండేవారు. ప్రభుత్వం ఆయనను ప్రొటోకాల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వ్యవహారాల సలహాదారుడిగా నియమించడం గమనార్హం. ఎస్సీ,ఎస్టీ,బీసీల సంక్షేమంతో ఎటువంటి సంబంధం లేని షబ్బీర్ అలీని ఆయా వర్గాల సంక్షేమ సలహాదారుడిగా నియమించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఏపీ మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజును ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సలహాదారుడిగా నియమించారు. ఆయన సుదీర్ఘకాలంపాటు టీటీడీలో జేఈవోగా పనిచేశారు. అక్కడ టీటీడీ ఈవోగా నియమిస్తారని భావించినప్పటికీ, ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడంతో ఇటీవలే ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. గత నెల 25న ఏపీ ప్రభుత్వం శ్రీనివాసరాజు వీఆర్ఎస్ దరఖాస్తును ఆమోదించింది. 2008 బ్యాచ్కు చెందిన ఆయన ఏప్రిల్ 2020 నుంచి ఈ ఏడాది మే వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్పై ఆర్అండ్బీ శాఖ ప్రిన్స్పల్ సెక్రటరీగా పనిచేశారు.
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశాలపై ఇటీవలే ఆయన తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీలో రిపోర్ట్ చేశారు. అయితే, అక్కడ ఎటువంటి బాధ్యతలు చేపట్టకుండానే వీఆర్ఎస్ తీసుకోగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సలహాదారుడిగా నియమించింది. తెలంగాణ ప్రభుత్వ ముందస్తు హామీ ప్రకారమే ఆయన ఇక్కడి నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లి వీఆర్ఎస్ తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.