హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణను గురువారం చేపట్టేందుకు ముహూర్తం దాదాపు ఖరారు అయినట్టు అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. మంత్రిమండలిలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ముఖ్యనేతలతో అధిష్ఠానం చర్చించింది. రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్న అధిష్ఠానం పెద్దలు, వారు సూచించిన పేర్లను పార్టీ ఆగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదానికి పంపించారు. వారి నుంచి గ్రీన్సిగ్నల్ లభించిన జాబితాను బుధవారం ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డికి అందించనున్నారు. దీనికోసం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మరోసారి బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు. మంత్రివర్గ విస్తరణ కసరత్తు పూర్తికావడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సీఎం రేవంత్రెడ్డి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో చర్చించి వచ్చారు.
మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాతినిథ్యం లభించని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పీ సుదర్శన్రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్రావుతోపాటు ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్న నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్లు దాదాపు ఖరారు అయినట్టు సమాచారం. పార్టీ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు, మంత్రి దామోదర రాజనరసింహ కథనం ప్రకారం దానం నాగేందర్కు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నది.
ఆదిలాబాద్ జిల్లా కోటాలో తన పేరు పరిశీలనలో ఉన్నట్టు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్స్వామి ధీమాగా ఉన్నారు. మంత్రివర్గంలో ఎస్టీల్లో లంబాడి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రిమండలిలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కూడా ఢిల్లీలోనే మకాం వేసి లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రిమండలిలో ఆరు ఖాళీలు ఉండగా నాలుగు లేక ఐదింటిని మాత్రమే భర్తీ చేయాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తుండగా, వీటి కోసం పది మంది ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు.
మంత్రుల సంఖ్య పద్దెనిమిదా? లేక పదిహేడా? అనే అంశంలో వివాదం నెలకొన్నది. ఎమ్మెల్యేల సంఖ్యలో మంత్రుల సంఖ్య 15 శాతానికి మించకూడదనే నిబంధన. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డితో కలిపి మంత్రుల సంఖ్య 12 కాగా ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయనేది ప్రభుత్వ వాదన. చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ సభ్యున్ని నియమించే ఆనవాయితీని కేంద్రం తొలగించింది. దీంతో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకుంటే మంత్రుల సంఖ్యను 17కు పరిమితం చేయాల్సి ఉంటుంది.