Tummala Nageswara Rao | హైదరాబాద్, జులై 4(నమస్తే తెలంగాణ): ‘మీ ఇష్టమున్నప్పుడు ఆఫీస్కు వస్తారా? సమయ పాలన పాటించరా? ఉదయం 11 గంటలు అతున్నా ఆఫీసుకు రాకపోవడం ఏమిటి?’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అగ్రి కమిషనరేట్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన కమిషనరేట్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఉదయం 10.35కు కమిషనరేట్కు వెళ్లిన మంత్రి కార్యాలయం మొత్తం పరిశీలించారు. ఎక్కువ చాంబర్లు ఉద్యోగులు లేక ఖాళీగా కనిపించడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాని ఉద్యోగుల గురించి ఆరా తీశారు. ఆలస్యమైన వారినుంచి వివరణ తీసుకోవాలని, పూర్తి నివేదికను అందించాలని డైరెక్టర్ గోపిని ఆయన ఆదేశించారు.
మరోసారి ఈ పరిస్థితి పునరావృతమైతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం టెస్కాబ్ను మంత్రి తుమ్మల సందర్శించారు. అక్కడ నిర్వహించిన ఎన్సీడీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు మంత్రి తుమ్మలను సన్మానించారు.