హైదరాబాద్, జూలై3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై గెలుపొందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది. ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద్ వేసిన వేర్వేరు పిటిషన్లు బుధవారం జస్టిస్ బీ విజయసేన్రెడ్డి విచారణ చేసే కేసుల జాబితాలో చేర్చారు.
అయితే అనర్హత పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి కోరడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఆ ముగ్గురూ ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు.