Adani | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ‘ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే’ అన్నట్టుంటది అదానీ తీరు. ముంబైలో విద్యుత్తు బిల్లుల వసూళ్ల కాంట్రాక్ట్ సంపాదించిన అదానీ గ్రూప్ ఇప్పుడు విద్యుత్తుపై గుత్తాధిపత్యం సాధించింది. ఇకపై తెలంగాణలోనూ ఇవే పరిస్థితులు ఉంటాయన్నది విమర్శకుల మాట. హైదరాబాద్లోని పాతబస్తీలో విద్యుత్తు బిల్లుల వసూలు బాధ్యతను అదానీ గ్రూప్ కంపెనీకి అప్పగించినట్టు ఇటీవల ఢిల్లీలో జరిగిన మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. విద్యుత్తు వ్యవస్థ ప్రైవేటీకరణకు దీనిని తొలి అడుగుగా అభివర్ణిస్తున్నారు.
అసలు ముంబైలో ఏమైంది?
అదానీ పవర్ పేరిట అప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుదుత్పత్తి కేంద్రాలు స్థాపించిన అదానీ గ్రూప్ సెప్టెంబర్ 18, 2008లో అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ను ప్రారంభించింది. ముంబై మహానగరంలోని దాదాపు 30 వేల జనాభా ఉన్న ప్రాంతానికి విద్యుత్తు బిల్లుల వసూళ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. అలా పదేండ్లలో ముంబైలోని 400 చదరపు కిలోమీటర్ల పరిధిలో అంధేరీ, వంద్రే, మీరా భైందర్, బోరివాలీ, మలాద్, పోవాయి, చెంబూరు వంటి ఏడు పెద్ద డివిజన్లలో దాదాపు 31 లక్షల మందికి విద్యుత్తు సరఫరా, చార్జీల వసూలు, మరమ్మతులు.. ఇలా ప్రతీ కాంట్రాక్ట్ను అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ దక్కించుకొన్నది. దీనికోసం 2018లో అప్పటి బీజేపీ ప్రభుత్వం సహకారంతో మహారాష్ట్ర ఈస్టర్న్ గ్రిడ్ పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ (ఎంఈజీపీటీసీఎల్), మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఎంఈఆర్సీ)తో పలు ఒప్పందాలను కుదుర్చుకొన్నది. అలా ఈ ఏడు ప్రాంతాలపై విద్యుత్తు గుత్తాధిపత్యం ఆ కంపెనీ సొంతమైంది.
చార్జీల బాదుడు షురూ..
31 లక్షల జనాభా ఉన్న ప్రాంతంపై గుత్తాధిపత్యం సాధించిన అనంతరం సామాన్యులపై అదానీ కంపెనీ బాదుడు మొదలుపెట్టింది. ఫ్యూయెల్ అడ్జస్ట్మెంట్ చార్జీల పేరిట గడిచిన ఆరేండ్లలో ఎనిమిదిసార్లు విద్యుత్తు చార్జీలు పెంచింది. తాజాగా గత మేలో ఒక్కో యూనిట్పై రూ. 1.70 వడ్డించింది. బిల్లుల చెల్లింపుల్లో ఏమాత్రం ఆలస్యం జరిగినా కనెక్షన్ను కట్ చేయడం, పునరుద్ధరణ సర్వీసు చార్జీల పేరిట వసూళ్లకు తెగబడడం నిత్యకృత్యంగా మారింది. అంతేకాదు, గాలివానలు, కోతుల కారణంగా విద్యుత్తు తీగలు తెగిపడినా, మరే ఇతర కారణంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడినా దానికీ సేవా రుసుములను వసూలు చేస్తున్నది. దీన్ని నిరసిస్తూ వినియోగదారులు ఇటీవల ఎంఈఆర్సీని ఆశ్రయించగా, సదరు కమిషన్ అదానీ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ, వాటికి స్పందించకుండా చార్జీల పరంపరను కొనసాగిస్తున్నది. ఒక్కో సమయంలో కరెంటుకు ఒక్కో టారిఫ్ను వసూలు చేయడం, ఎవరు ఎంత కరెంటు కాలుస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవడానికి 10.8 లక్షల ఇండ్లల్లో స్మార్ట్మీటర్లను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించడం వంటివాటిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తర్వాత హైదరాబాద్లోనే?
నిబంధనలకు విరుద్ధంగా ముంబైవాసుల ముక్కుపిండి అదనపు చార్జీలు వసూలు చేస్తున్న అదానీ కంపెనీకి పాతబస్తీ ప్రాంతానికి సంబంధించి బిల్లింగ్ వ్యవస్థను అప్పగించడం సామాన్యుల నడ్డివిరగ్గొట్టడమేనని విద్యుత్తు రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలుత బిల్లింగ్ కోసమంటూ ముంబైలో ప్రవేశించిన అదానీ కంపెనీ.. ఆ తర్వాత చార్జీల వాత పెడుతూ కరెంటుపై పెత్తనాన్ని సాగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రేప్పొద్దున ఇదే పరిస్థితి హైదరాబాద్లోనూ రావొచ్చని హెచ్చరిస్తున్నారు. విద్యుత్తు బిల్లుల వసూలు బాధ్యతను అదానీ గ్రూప్ కంపెనీకి అప్పగించాలన్న నిర్ణయాన్ని రేవంత్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మన దగ్గర ఏమవ్వొచ్చు?