కాజీపేట, సెప్టెంబర్ 4: ఇన్స్ట్రాగ్రామ్ వీడియో కోసం చేసిన ప్రయత్నం ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలపైకి తెచ్చింది. హనుమకొండ జిల్లా కాజీపేట-బల్లార్ష సెక్షన్లోని టౌన్ రైల్వేస్టేషన్ వడ్డేపల్లి చెరువు వద్ద ఆదివారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన సీహెచ్ అక్షయ్రాజ్ (17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు.
ఆదివారం సెలవు కావడంతో స్నేహితులు సిద్ధు, గణేశ్తో కలిసి వడ్డేపల్లి చెరువు కట్టపై ఉన్న రైలు పట్టాల వద్దకు వచ్చాడు. అక్షయ్ ట్రాక్ పక్క నుంచి నడుస్తుండగా స్నేహితులు వీడియో తీస్తున్నారు. అదే సమయంలో బల్లార్ష వైపు నుంచి విజయవాడ వైపునకు వేగంగా వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు లోకోపైలెట్ హారన్ కొట్టినా అక్షయ్ జరుగకపోవడంతో వేగంగా ఢీకొట్టింది. దీంతో అక్షయ్ పక్కకు పడిపోయాడు. అనంతరం లోకోపైలెట్ రైలును నిలిపి బాధితుడి వద్దకు వచ్చి పరిశీలించాడు. 108 వాహనానికి సమాచారం ఇవ్వగా, నగరంలోని ఎంజీఎం దవాఖానకు తలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు అక్షయ్ని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ దవాఖానకు తరలించినట్టు సమాచారం.