మోహన్రావు ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఇంటికి దూరపు బంధువు ఒకరు వస్తే.. మార్కెట్లో చికెన్ తెద్దామని వెళ్లాడు. కిలో రూ.280 ఉన్నది. దాంతో చేసేదేమీలేక రూ.80 పెట్టి డజను కోడిగుడ్లు తీసుకుని వెళ్లిపోయాడు. సావిత్రమ్మ ఓ గృహిణి. అంగట్లో కూరగాయలు కొనేందుకు వెళ్లింది. కిలో టమాట రూ.100 పలుకుతున్నది. ఉల్లిగడ్డ రూ.50 అంటున్నారు. పచ్చి మిర్చి రూ.80 చెప్తున్నారు. బెండ, దొండ, వంకాయ.. ఇలా ఏది అడిగినా పావు రూ.20 కంటే తక్కువ లేవు. ఇక పరందామయ్య వయసు 70. నిత్యం షుగర్, బీపీ ట్యాబ్లెట్లు మింగాల్సిందే. మందు బిళ్లలు అయిపోతే మెడికల్ షాపులో ఎప్పుడూ ఇచ్చేంత ఇచ్చినా ఇంకా కావాలంటున్నారు. అదేంటని అడిగితే రేట్లు పెరిగాయన్న సమాధానం. కిరాణా సరకుల కోసం వెళ్లిన కిశోర్, పండ్లు తెచ్చేందుకు పోయిన రవీందర్లదీ ఇంతే సంగతి.
Price Rise | న్యూఢిల్లీ, జూన్ 30: ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు. అవును.. కొనడానికి పోతే కొరివితో తలగోక్కున్నట్టే అనేలా తయారైంది పరిస్థితి. కిరాణా సరకుల దగ్గర్నుంచి కూరగాయలు, పండ్లదాకా అన్నింటి రేట్లూ మోత మోగిస్తున్నాయి. చివరకు అత్యవసర ఔషధాలనూ కొనుక్కోలేని దుస్థితి దాపురించింది. ఒక్కమాటలో చెప్పాలంటే సామాన్యుల ఇంటి బడ్జెట్ తలకిందులైపోయింది. అసలే మార్కెట్ మందగమనంలో ఉన్న వేళ.. ద్రవ్యోల్బణం విజృంభిస్తుండటంపట్ల అన్ని వర్గాల్లోనూ ఆందోళన కనిపిస్తున్నదిప్పుడు. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం పెచ్చుమీరకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఎఫ్ఎంసీజీ ఎఫెక్ట్
ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు తాము తయారు చేస్తున్న దాదాపు అన్ని ఉత్పత్తుల రేట్లనూ పెంచేశాయి. సబ్బులు, హెయిర్ ఆయిల్స్తోపాటు వివిధ ఆహారోత్పత్తుల ధరలు గడిచిన 2-3 నెలల్లో 2 నుంచి 17 శాతం వరకు పెరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వేళ కంపెనీలు ధరలు పెంచడం చర్చనీయాంశమైంది. 2022తోపాటు 2023 ప్రథమార్ధం వరకు ఎఫ్ఎంసీజీ సంస్థలు ధరలు పెంచాయి.
అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు, పామాయిల్ ధరలు తగ్గుముఖం పట్టినా.. వాటి ఆధారిత ఉత్పత్తుల ధరలు పెరగడం గమనార్హం. కాగా, చాలా సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచకుండా, వాటి పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో వినియోగదారులకు తెలియకుండానే వారిపై ధరల భారాన్ని కార్పొరేట్ కంపెనీలు మోపుతున్నాయి.
ఇది ఆరంభమే..
ఏప్రిల్లో హెయిర్ ఆయిల్ ధరలను 6 శాతం పెంచామని, కొబ్బరి రేట్లు పెరుగుతున్నందున మళ్లీ పెరిగేందుకు వీలున్నదని ఇటీవలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం మారికో సంకేతాలిచ్చింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో తమ ఉత్పత్తుల ధరలను 2 నుంచి 4 శాతం పెంచబోతున్నట్టు స్నాక్స్ తయారీదారు బైకాజీ తెలిపింది. ఉత్పాదక వ్యయం పెరిగిందంటూ డాబర్, ఇమామీ సంస్థలు కూడా తమ ఉత్పత్తుల రేట్లు కొంతమేర పెరుగుతాయంటున్నాయి.
ఔషధాలూ పిరం
ప్రజలకు అత్యవసరమైన ఔషధాల ధరలను నియంత్రించడంలోనూ మోదీ సర్కారు విఫలమవుతున్నది. ఏకంగా 800 కీలక ఔషధాల ధరల్లో పెంపు.. ఇప్పుడు దేశంలోని మెజారిటీ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే రక్తపోటు (బీపీ), చక్కెర వ్యాధి (డయాబెటిస్ లేదా షుగర్)తో బాధపడుతున్నవారు ఎక్కువ సొమ్ము పెట్టి మందులను కొనుక్కోవాల్సి వస్తున్నది. గడిచిన రెండు నెలలుగా క్రమేణా ఆయా మందుల ధరలు పెరుగుతూనే ఉన్నాయని, ఇలా ఇప్పటిదాకా 15 శాతం పెరిగాయని మెడికల్ షాపు యాజమాన్యాలు చెప్తున్నాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి ఔషధాల ధరలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో రెక్కలొచ్చాయి.
అంతేగాక సర్కారు తీరు ఔషధ తయారీ సంస్థలకు లాభాల్ని పంచిపెడుతున్నది. ఏటా కొంతమేర పెంచేందుకు డ్రగ్స్ కంపెనీలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అయినప్పటికీ షెడ్యూల్డ్ ఫార్ములేషన్లపై 10 శాతం, నాన్-షెడ్యూల్డ్ డ్రగ్స్పై 20 శాతం మేర ధరల్ని పెంచుకుంటామని ఫార్మా కంపెనీల లాబీయింగ్ గ్రూప్ పావులు కదుపుతుండటం గమనార్హం. నిజానికి గతంలోనే 10-12 శాతం వరకు రేట్లను పెంచాయి.
ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు
రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆమోదయోగ్య స్థాయిలో నమోదు కావడం లేదు. మే నెలకుగాను ఇటీవల కేంద్రం విడుదల చేసిన లెక్కలనే చూస్తే.. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉన్నది. ఇక టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత హోల్సేల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 2.61 శాతానికి ఎగబాకింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం దిగువనే ఉంచాలన్నది ఆర్బీఐ లక్ష్యం.
అందుకే ఇటీవలి ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లను గరిష్ఠ స్థాయిల్లోనే ఉంచింది. ఇది ఇతర రంగాల రుణ లభ్యతను దెబ్బతీస్తున్నది. రుణగ్రహీతలపై ఈఎంఐల భారాన్నీ పెంచుతున్నది. అయితే వర్షాధార పంటలే ఎక్కువగా ఉన్న భారత్లో.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టేదాకా పరిస్థితి ఇలాగే ఉంటుందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం, వ్యవసాయాన్ని, రైతులను చిన్నచూపు చూడటం మోదీ సర్కారు ఇకనైనా మానుకోవాలని మెజారిటీ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. ఇక సరైన గిడ్డంగుల వ్యవస్థ ఉంటే.. మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరకులు లభిస్తాయని ఆర్థిక, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
త్వరలో పెట్రో వడ్డనలు!
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ర్టాల అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇన్నాళ్లూ పెట్రో ధరల పెంపును అడ్డుకున్న కేంద్రం.. ఇప్పుడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు పెంపుపై స్వేచ్ఛనివ్వబోతున్నట్టు సమాచారం. ఇక రవాణా చార్జీల భారం ఆయా వస్తూత్పత్తులపై తప్పక ఉంటుంది. దీంతో రిటైల్ మార్కెట్లో వాటి ధరలు ఇంకా పెరగడం సహజమే.
ధరలెందుకు పెరుగుతున్నాయ్?
దేశంలో ధరలు ఇంతలా పెరుగుతుండటం వెనుక డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడమే కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి నైరుతీ రుతుపవనాలు ఈసారి ముందుగా వచ్చినా.. ఆశించిన స్థాయిలో మాత్రం వర్షపాతం లేదు. పంటలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంకా ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిల్లోనే నమోదవుతున్నాయి. దీంతో ఇప్పట్లో పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, కూరగాయల ధరలు తగ్గకపోవచ్చనే మెజారిటీ విశ్లేషకులు చెప్తున్నారు.
ఇక పండిన పంటలను నిల్వ చేసుకోవడంలోనూ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. ఉల్లి, టమాట, పాలకూర, వంకాయ ఇలా అన్ని కూరగాయల ధరలకు రెక్కలు తొడగడానికి కారణం ఇదేనన్న విమర్శలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు గోధుమల సరఫరా మార్కెట్లోకి తగ్గిపోతున్నది. అయినా దిగుమతులపై కేంద్రం ఇంకా ఓ నిర్ణయానికి రాకపోవడం కూడా ధరల పెంపునకు దారితీస్తున్నట్టు చెప్తున్నారు. వరి, చెరకు పంటలు దెబ్బతిని.. బియ్యం, చక్కెర రేట్లను పరుగులు పెట్టిస్తున్నాయి.
ప్రభుత్వం ఏం చేయాలి?
చివరగా.. తాజాగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. తమకు ఆదరణ తగ్గలేదని నిరూపించుకోవడానికి త్వరలో జరిగే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. అందుకే అక్కడి రైతుల మద్దతును సంపాదించుకొనేందుకు మోదీ సర్కారు విశ్వ ప్రయత్నాలనే చేస్తుంది. దీంతో ధరలను అడ్డుకుని వారి ఆగ్రహానికి గురయ్యే సాహసం కమలం పార్టీ పెద్దలు చేయకపోవచ్చనే విశ్లేషణలున్నాయి. ఇంకొన్నాళ్లు ఓపికపట్టి ఆ తర్వాతే ఏదో ఒకటి చేద్దామన్న ధోరణితో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు చెప్తున్నారు. మొత్తానికి ధరల అదుపు ఇప్పట్లో జరగదనేదే సారాంశం.
పండ్లు, కూరగాయల ధరలు హోల్సేల్ మార్కెట్లోనే బాగా పెరిగిపోయాయి. దీంతో రిటైల్ ధరలు ఇంకా ఎక్కువైపోయాయి. ఇప్పటికే వ్యాపారం తగ్గిపోయింది. ఎప్పుడూ కిల్లోల్లో కొనే కస్టమర్లు కూడా ఇప్పుడు అర్ధ, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే కష్టకాలమే.
-పండరీనాథ్, పండ్లు, కూరగాయల వ్యాపారి
పప్పులు, సబ్బులు, టూత్ పేస్టులు.. అన్ని కిరాణా సరకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ధరలు ఇలా పెరుగుతూపోతే వినియోగదారులకే కాదు.. వ్యాపారులకూ ఇబ్బందే. బిజినెస్ పడిపోవడం వల్ల పెట్టిన పెట్టుబడులు రావడం లేదు. ఈఎంఐల చెల్లింపులూ ఇబ్బందికరంగా మారుతున్నాయి.
-రాజు, కిరాణా వ్యాపారి
ఈ ఏడాది కోళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో చికెన్ రేట్లూ అదే స్థాయిలో కదలాడుతున్నాయి. కిలో రూ.300 దరిదాపుల్లో ఉండటం.. వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నది. డజను కోడిగుడ్లు సైతం రూ.70-80కి అమ్ముతున్నాం. ఫామ్ స్థాయిలో పెరిగిన ఖర్చులు రిటైల్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి.
-సురేశ్, చికెన్ షాపు యజమాని
మందుల రేట్లు పెరుగుతున్నాయి. ప్రధానంగా బీపీ, షుగర్ ఔషధాల ధరలు ఇటీవలికాలంలో బాగా పెరిగిపోయాయి. గడిచిన రెండు నెలల్లో ఏకంగా 15 శాతం వరకు ఎగిశాయి. మా రెగ్యులర్ కస్టమర్లకూ ఇబ్బంది కలుగుతున్నది. నెలనెలా ఇలా రేట్లు పెరగడమేంటి? అంటూ అంతా విస్తుపోతున్నారు.
-సాయి, మెడికల్ షాపు యజమాని
ప్రతి నెలా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆదాయం మాత్రం అంతంతే ఉంటున్నది. ఇలాగైతే ఏం పెట్టి కొనేది.. ఎలా తినేది. రెండు నెలల క్రితం రూ.500కు వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.700-800 పెట్టాల్సి వస్తున్నది. కిరాణా సరుకుల నెలవారీ బడ్జెట్ కూడా పెరిగిపోయింది.
-స్రవంతి, గృహిణి