Train tragedy : యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి బీబీనగర్ దగ్గర రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ వృద్ధుడిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దాంతో వృద్ధుడు రైలు ఇంజిన్కు చిక్కుకున్నాడు. ఇది గమనించిన లోకోపైలెట్ అలాగే రైలును పోనిచ్చాడు. దాంతో వృద్ధుడి మృతదేహం ఘట్కేసర్ వరకు రైలుకు వేలాడుతూ వచ్చింది.
ఘట్కేసర్ రైల్వే గేటు దగ్గర రైలుకు వేలాడుతున్న వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో రైల్వే పోలీసులు ఘట్కేసర్ దాటిని తర్వాత రైలును ఆపి మృతదేహాన్ని తొలగించారు. రైలు వరంగల్ నుంచి సికింద్రాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.