బంజారాహిల్స్, మార్చి 27: హైదరాబాద్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి గత ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా నర్వ ప్రాంతానికి చెందిన మొరెడ్డి నాగరాజురెడ్డి (42) హైదరాబాద్ కార్మికనగర్లో నివాసం ఉంటున్నాడు. తనను మధురానగర్ పోలీసులు వేధిస్తున్నారంటూ ఈ నెల 24న అర్ధరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లోని సీఎం రేవంత్రెడ్డి నివాసం వద్దకు యాక్టివా బైక్పై వచ్చాడు. తాను సీఎంను కలుస్తానంటూ అక్కడే భీష్మించుకొని కూర్చున్నాడు. భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో బ్లేడ్తో చేయి కోసుకున్నాడు. మధురానగర్ పోలీస్స్టేషన్ అడ్మిన్ ఎస్ఐ బాలరాజు, కానిస్టేబుల్ గోపి తనను ఫోన్ చోరీ కేసులో వేధిస్తున్నారని తెలిపాడు. ఎస్ఐ అనిల్కుమార్ ఫిర్యాదు మేరకు నాగరాజురెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.