నిజామాబాద్ : వరద కాలువపై కారు రివర్స్(Car reversing) తీస్తుండగా అదుపుతప్పి పక్కనున్న కుంటలోకి జారిపోయింది. ఈ ఘటనలో ఓ రైతు(died మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల్ గ్రామానికి చెందిన రైతు గాదేపల్లి రమేశ్ (55)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమేశ్కు పోచంపల్లి గ్రామ శివారులో పొలం ఉంది. అయితే, అక్కడి బండరాయి వాగు మత్తడిలో మోటారు దించేందుకు ఆయన సోమవారం తన కారులో వెళ్లాడు. వరద కాలువపై కారు నిలిపి తన పని పూర్తి చేసుకున్నాడు.
తిరిగి వస్తుండగా కారు రివర్స్ చేసే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న కుంటలోకి దూసుకెళ్లింది. దీంతో కారుతో సహా ఆయన నీట మునిగిపోయాడు. అక్కడున్న వారు 100కు కాల్ చేయగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మత్స్యకారుల సహాయంతో కారును బయటకు వెలికితీసి చూడగా రమేశ్ చనిపోయి కనిపించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. రమేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.