TSPSC | హైదరాబాద్ : నిరుద్యోగుల టీజీఎస్పీఎస్సీ ముట్టడి నేపథ్యంలో చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీజీఎస్పీఎస్సీ కార్యాలయంతో పాటు నాంపల్లి, మోజాంజాహీ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు వెళ్లే ప్రతి ఒక్కరిని ఏదో ఒక పేరుతో అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఓ ఇద్దరు దంపతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు వారి వద్ద ఉన్న సెల్ఫోన్ను లాక్కొని వాట్సాప్ ఓపెన్ చేయాలని అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల తీరుపై ఆ దంపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో భార్యాభర్తలు రోడ్డుపై కూడా నడవొద్దా..? దంపతులు రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ కూడా లేదా..? రోడ్డు మీద వెళ్లొద్దా..? మేం ఉగ్రవాదులమా..? దొంగలమా..? ఇదేనా ప్రజా పాలన అని ఆ దంపతులు నిలదీశారు.
ఓ రైతు లుంగీ కట్టుకోని మరో ఇద్దరితో కలిసి నాంపల్లి ఏరియాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. పోలీసులు ఆ రైతుతో పాటు మరో ఇద్దరిని అడ్డుకున్నారు. బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. తాను తన కొడుకు కాలేజీ కోసం వచ్చానని సదరు రైతు చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ధర్నాకు రాలేదని మొత్తుకుంటుంటే.. మరి ఎక్కడికి వచ్చావంటూ రైతును ప్రశ్నిస్తూ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. అమాంతం ఆయనను పోలీసు వాహనంలోకి ఎక్కించారు. పోలీసుల తీరుపై సదరు రైతు మండిపడ్డారు. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం రైతుతో పాటు మరో ఇద్దరిని గోషామహల్ పోలీసు స్టేషన్కు తరలించారు.
TGSPSC వద్ద రోడ్డు మీద వెళ్తున్న ఓ భార్య, భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/6LBoPBPvEU
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2024