హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్పై ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం ప్రత్యేక కమిటీని నియమించినట్టు డీఎంఈ వాణి బుధవారం తెలిపారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరామని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కళాశాలలో లిఫ్ట్లు ఆపేశారని, దవాఖాన సిబ్బందితోపాటు రోగులు, విద్యార్థులను అకారణంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్ అరుణను వెంటనే తొలిగించాలని డీఎంఈకి మంగళవారం ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే.
సివిల్స్ మెయిన్స్కు ఎస్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థులు
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): యూపీఎస్సీ వెల్లడించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల్లో రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్కు చెందిన 24 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని ఎస్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నర్సింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సివిల్స్ కోసం స్టడీ సర్కిల్లో 150 మందికి శిక్షణ ఇవ్వగా, 24 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని వివరించారు.
‘నాలుగేండ్ల నిబంధన అమలుచేయాలి’
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఆర్థికశాఖ గైడ్లైన్స్ ప్రకారం నాలుగేండ్ల బదిలీ నిబంధనను అన్ని గురుకులాల్లో కచ్చితంగా అమలుచేయాలని గురుకుల జేఏసీ అధ్యక్షుడు మామిడి నారాయణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఒకేచోట నాలుగేండ్లకుపైగా పనిచేస్తున్న వారికి నిబంధనలు అమ లు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్డేపల్లి ప్రభుదాస్, ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రుషికేశ్ విజ్ఞప్తిచేశారు.
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. మూడు విడుతల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. గురువారం నుంచి 12 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించామని అడ్మిషన్స్ కన్వీనర్ ఏ శ్రీదేవసేన తెలిపారు. 6 నుంచి 13 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, 19కి ముందు సీట్లను కేటాయిస్తామని వెల్లడించారు. వివరాలకు https:// tgeapcet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
బాధ్యతలు స్వీకరించిన కమిషనర్లు
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్రశిక్ష ప్రాజెక్ట్ అధికారిగా నియమితులైన ఈవీ నర్సింహారెడ్డి సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా నియమితులైన శ్రీదేవసేన నాంపల్లిలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానంద్గౌడ్, తదితరులు నర్సింహారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాన్ని సమర్పించారు.