కరీంనగర్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశం సాక్షిగా ఓ దళిత జడ్పీటీసీ సభ్యుడికి ఘోర అవమానం జరిగింది. కరీంనగర్ జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధుకు సంబంధించిన సుమారు 4,500 మందికి రెండో విడత గ్రాంట్ రావాల్సి ఉన్నది. వాటిని విడుదల చేయాలని అక్షరాలతో ముద్రించిన టీ షర్టును వేసుకొని జమ్మికుంట జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాం శ్యామ్ సమావేశానికి వెళ్లేందుకు గేటు వద్దకు వచ్చారు. దీనిని గమనించిన పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
ఈ టీ షర్ట్ విడిచి వేరే చొక్కా వేసుకుని వస్తేనే లోనికి అనుమతిస్తామని గట్టిగా చెప్పారు. ఈ విషయాన్ని శ్యామ్ అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు తెలిపారు. పోలీసులు మరోసారి జోక్యం చేసుకుని ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించారు. అయినా శ్యామ్ అక్కడే ఉన్నారు. దీంతో పోలీసులు బలవంతంగా జడ్పీ ప్రధాన గేటు వెలుపలి వరకు పంపించి ఈ షర్ట్ వేసుకుని మరోసారి ఇటు రావద్దని హెచ్చరించారు. దీనిపై జడ్పీ సర్వసభ్య సమావేశంలో పెద్ద దుమారం రేగింది.
తాము నక్సలైట్లమా? టెర్రరిస్టులమా? అంటూ నిలదీశారు. వెంటనే జోక్యం చేసుకున్న జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ.. జడ్పీటీసీ శ్యామ్ను సమావేశానికి రానివ్వాలని పోలీసులను కోరారు. అయినా వినకుండా.. తమకు జడ్పీ సీఈవో చెప్పాలని ఓ పోలీసు అధికారి స్పష్టం చేశారు. అధ్యక్షురాలు సీఈవోకు విజ్ఞప్తి చేయగా.. ఆయన మౌనంగా ఉండిపోవడంతో కాసేపు గొడవ జరిగింది. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఒక్క జడ్పీటీసీ సభ్యుడికి జరిగిన అవమానం కాదని, జడ్పీ అధ్యక్షురాలికి, సభకు జరిగిన అవమానమని వ్యాఖ్యానించారు.
అంతకుముందు విద్యా శాఖపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి డీఈవో జనార్దన్రావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భోజన విరా మం తర్వాత రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను సత్కరించారు. ఈ సందర్భంగా తన ఐదేండ్ల పాలనను గుర్తుచేసుకున్న జడ్పీ అధ్యక్షురాలు విజయ భావోధ్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.