Drinking Water | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో తాగునీటి సరఫరా వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నదా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో సంతోషించిన నగర ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవా? ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానమే వినిపిస్తున్నది. ప్రస్తుతం అటు కృష్ణా, ఇటు గోదావరి నుంచి అత్యవసర మోటార్లతో నీటిని తరలిస్తున్న జలమండలి.. ఇప్పుడు వరుణుడి కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. వరుణుడు కరుణించేలోగా సాంకేతిక సమస్యలు తలెత్తితే జలమండలి చేతులెత్తేయడం ఖాయంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా ఇప్పుడు గోదావరి జలాలను తరలించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. హైదరాబాద్కు గోదావరి జలాలను తరలించడంలో ఎల్లంపల్లి జలాశయం అత్యంత కీలకమైనది.
కానీ, కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడంతో ఎల్లంపల్లి జలాశయంలో నీటిమట్టం రోజురోజుకూ అడుగంటిపోతున్నది. దీంతో ఆ జలాశయం నుంచి రోజుకు 17.2 కోట్ల గ్యాలన్లకుగాను 16.3 కోట్ల గ్యాలన్ల నీరు సరఫరా అవుతున్నది. ఇందులో రోజుకు 3 కోట్ల గ్యాలన్ల నీటిని మార్గమధ్యంలో మిషన్ భగీరథకు అందిస్తున్నారు. అంటే హైదరాబాద్కు రోజుకు 13.3 కోట్ల గ్యాలన్ల నీరు మాత్రమే సరఫరా అవుతున్నది. ఫలితంగా ప్రస్తుతం 3.9 కోట్ల గ్యాలన్ల కొరత కొనసాగుతున్నది. అన్నారం, సుందిల్ల బరాజ్లలోని ఎల్లంపల్లికి ఎత్తిపోయకుండా దిగువకు వదిలివేయడమే ఈ దుస్థితికి కారణం.
నిరుడు ఇదే సమయానికి 12 టీఎంసీల నీటినిల్వను కలిగివున్న ఎల్లంపల్లిలో ప్రస్తుతం 3.9 టీఎంసీల నిల్వ మాత్రమే ఉన్నది. ఇందులో నిత్యం ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు, ఆర్ఎఫ్సీసీకి 225 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కింద మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాలకు 200 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. దీంతో జలమండలి అధికారులు గత కొన్ని రోజులుగా అత్యవసర మోటార్లతో నీటి సరఫరాను కొనసాగిస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయానికి ప్రాణాధారమైన కడెం ప్రాజెక్టుకు కూడా ప్రస్తుతం పెద్దగా వరద రావడం లేదు. ఎగువన వర్షాలు లేకపోవడమే ఇందుకు కారణం. 7.6 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన కడెంలో ప్రస్తుతం 3.9 టీఎంసీల నిల్వ మాత్రమే ఉన్నది. రానున్న 10-15 రోజుల్లో కడెంకు వరద పెరగకపోయినా, ఎల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవకపోయినా హైదరాబాద్కు తీవ్ర నీటికష్టాలు తప్పవని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
సాగర్లో పడిపోయిన నీటి మట్టం
కృష్ణా నది నుంచి హైదరాబాద్కు మూడు దశల్లో 90 ఎంజీడీల చొప్పున రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా జరుగుతుంది. ఇది ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)పై ఆధారపడి ఉన్నది. కానీ, ప్రస్తుతం నాగార్జునసాగర్లో నీటిమట్టం 510 అడుగుల కంటే దిగువకు పడిపోవడంతో అత్యవసర మోటార్ల ద్వారా నీటి సరఫరా కొనసాగిస్తున్నారు. పుట్టంగండి వద్ద జలమండలి ఏర్పాటు చేసిన అత్యవసర మోటార్ల ద్వారా ఏఎమ్మార్పీ అప్రోచ్ ఛానల్లోకి నీటిని తరలిస్తున్నారు. తద్వారా ప్రాజెక్టులోని రెండు మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. డిశ్చార్జి ప్రకారం 1,200 క్యూసెక్కులు రావాల్సి ఉండగా.. ప్రస్తుతం అక్కంపల్లి జలాశయానికి లింక్కెనాల్ ద్వారా 800 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం కోదండాపూర్ ట్రీట్మెంట్ ప్లాంటులోని పంపుహౌజ్లో ఎన్ఆర్వీ వాల్వ్ చెడిపోవడంతో రెండో దశ ద్వారా 90 ఎంజీడీల నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రెండ్రోజులపాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటించింది.