TG EAPCET | హైదరాబాద్ : టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు 56,674 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నట్లు ఎప్సెట్ నిర్వాహకులు వెల్లడించారు. జులై 4 నుంచి 12వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. స్లాట్ బుకింగ్ ఆధారంగా 6 నుంచి 13వ తేదీ మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుంది.
జులై 8 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 15న వెబ్ ఆప్షన్లను ఫ్రీజింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జులై 19న సీట్ల కేటాయింపు జరగనుంది. ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్కు జులై 19 నుంచి 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు. తదితర వివరాల కోసం https://tgeapcet.nic.in/default.aspx అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
ఈ యేడు ఇంటర్నల్ స్లైడింగ్ను కన్వీనర్ కోటాలో చేపట్టనున్నారు. తుది విడుత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఆగస్టు 9, 10తేదీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ను చేపడతారు. మూడు విడుతల కౌన్సెలింగ్లో ఒక కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థి అదే కాలేజీలో మరో బ్రాంచీలో సీటు ఖాళీగా ఉంటే ఇంటర్నల్ స్లైడింగ్ విధానంలో ఆయా సీటును ఎంపికచేసుకోవచ్చు. ఈ విధానంలో బ్రాంచి మారిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించేది కాదు. కానిప్పుడు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ను కన్వీనర్ కోటాలోనే చేపట్టనుండటంతో ఆయా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది.