న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసేవారు ప్రతి నెలా తాము సంపాదించిన మొత్తంలో కొంత సొమ్మును భవిష్యత్ అవసరాల కోసం ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంటారు. పదవీ విరమణ అనంతరం ఆ సొమ్మును తమ అవసరాలకో, పిల్లల పెండ్లిళ్లకో, చదువులకో వినియోగిస్తుంటారు. ఈ పీఎఫ్ సొమ్ము అనేది వ్యక్తి పొందే వేతనం, సర్వీసును బట్టి ఒక్కక్కరికి ఒక్కోలా ఉంటుంది. అందువల్ల రిటైర్మెంట్ తర్వాత కొందరికి రెండు మూడు లక్షలు వస్తే, మరికొందరికి ఇరవై, ముప్పై లక్షల వరకు వస్తాయి. కానీ, మన దేశంలోని ఒక వ్యక్తి పీఎఫ్ ఖాతాలో మాత్రం ఏకంగా రూ.103 కోట్లు జమ అయ్యాయి.
ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తుల పీఎఫ్ ఖాతాల్లో కూడా ఒక్కొక్కరి ఖాతాలో రూ.86 కోట్ల చొప్పున జమ అయ్యాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం కేవలం ముగ్గరు వ్యక్తులకే పీఎఫ్పై వడ్డీ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని గమనించింది. అంతేకాదు అత్యధికంగా పీఎఫ్ సొమ్ము జమచేసిన టాప్-20 మంది సొమ్ము రూ.825 కోట్లు, టాప్-100 మంది సొమ్ము రూ.2000 కోట్లు ఉందని కూడా ప్రభుత్వం లెక్కలు చూసింది. అయితే, తమ పీఎఫ్ ఖాతాల్లో అత్యధిక సొమ్ము జమచేసిన వారి పేర్లను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.
అందుకే అంత పెద్ద మొత్తంలో డబ్బును పొదుపు చేస్తున్న వారికి కూడా వడ్డీపై పన్ను మినహాయింపు ఇవ్వడం కరెక్టు కాదని కేంద్రం భావించింది. బ్యాంకుల్లో, పోస్టాఫీస్ ఖాతాల్లో అధిక మొత్తం జమచేసే వారి నుంచి వడ్డీపై పన్ను వసూలు చేస్తూ, పీఎఫ్ ఖతాలో భారీ నగదు జమచేసే వారికి మాత్రం పన్ను మినహాయింపునివ్వడం సమంజసం కాదని నిర్ణయించింది. అందుకే పీఎఫ్ ఖాతాల్లో సొమ్ముపై వడ్డీకి సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
ఇకపై, ఏడాదికి రూ.2.5 లక్షలు, అంతకుమించి తమ పీఎఫ్ ఖాతాలో జమ చేసుకునే వారికి పన్ను మినహాయింపు వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే ఈ నెల 31వ తేదీ వరకు పీఎఫ్ ఖాతాల్లో జమయ్యే సొమ్ముపై వచ్చే వడ్డీకి మాత్రం ఎలాంటి పన్నులు వేయబోరని, ఏప్రిల్ 1 నుంచి ఏడాదికి 2.5 లక్షలకుపైగా పీఎఫ్ ఖాతాలో జమచేసుకునే వారికి వడ్డీపై ట్యాక్సుల వడ్డింపు ఉంటుందని తెలిపింది.
2021- 22 ఆర్థిక బడ్జెట్లో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ప్రకారం.. ఇకపై ప్రతి ప్రతి ఒక్కరూ తమ ఆదాయంపైన మాత్రమేగాక పొదుపుపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, ఏడాదికి రూ.2.5 లక్షల కంటే తక్కువ మొత్తాన్ని తమ పీఎఫ్ ఖాతాలో జమచేసుకునే వారికి ఈ కొత్త నిబంధనతో ఎలాంటి నష్టం ఉండబోదు.