Telangana | హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఒక్క జూన్లోనే సుమారు 36 వరకు మర్డర్లు జరగడం కలకలం రేపింది. తెలంగాణలో పోలీసింగ్ గాడితప్పిందనేందుకు ఈ దారుణాలే నిదర్శంగా నిలిచాయి. అత్యంత క్రూరమైన, దారుణ హత్యలే వెలుగులోకి రాగా మరుగునపడ్డవి ఇంకా ఎన్నున్నాయో పోలీసులు ఇచ్చే నేర నివేదికలో తేలనున్నది.
ఈ నెలలో జరిగిన హత్యల్లో వివాహేతర సంబంధిత దారుణాలే ఎక్కువగా ఉన్నాయి. భర్తల అడ్డు తొలగించుకునేందుకు భార్యలు, భార్యల అడ్డు తొలగించుకునేందుకు భర్తలు మానవత్వాన్ని మరిచిపోయి మూడుముళ్ల బంధాన్ని అపహాస్యం చేస్తూ అఘాయిత్యాలకు తెగబడ్డారు. తమ అనైతిక బంధానికి అడ్డుగా ఉన్నారనో, పిల్లలు చూస్తే ఎక్కడ తన భర్త, లేదా భార్యకు దొరికిపోతామనే భయంతో కడుపున పుట్టిన బిడ్డలను సైతం దారుణంగా చంపుతున్నారు.
కాగా జూన్లో భూ తగాదాల కారణంగా జరిగిన హత్యలు కలకలం రేపాయి. నారాయణపేట జిల్లా ఉట్నూరులో ఓ వ్యక్తిని కుటుంబసభ్యులే కర్రలతో కొట్టిచంపడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సాతెల్లిలోనూ భూ వివాదం కారణంగా ఒకరిని హతమార్చారు. ఘట్కేసర్లో మాజీ ఎంపీటీసీ సభ్యుడిని, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో భూ తగాదాలతోనే బీఆర్ఎస్ కార్యకర్త తేజావత్ ఈర్యను హతమార్చారు.
ఇటీవల తెలంగాణలో ప్రతీకార హత్యలు విపరీతంగా పెరిగాయి. తమ వారిని చంపారనే ప్రతీకారంతో హత్యలో పాల్గొన్న వారిని చంపడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో రౌడీషీటర్లను పక్కా పథకం రచించి నడిరోడ్డుపైనే చంపేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ తరహా ప్రతీకార హత్యలు భారీగా నమోదయ్యాయి. రెయిన్ బజార్కు చెందిన నజాఫ్ అఘా పలు హత్య కేసుల్లో నిందితుడు. అతన్ని శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు దారుణంగా చంపేశారు.
అసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మహమ్మద్ షేక్ అలీమ్ను, టప్పాచబుత్ర గంగాబౌలికి చెందిన కుతుబుద్దీన్ను హత్యచేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీకి చెందిన జల్కం రవి తమ ఊరి వాట్సాప్ గ్రూపులో తన బర్త్డే ఫొటోలు తొలించారనే నెపంతో శేషగారి శివగౌడ్, గుండెమోని శివగౌడ్ను ఇంటికి పిలిపించి మరీ హత్యచేశాడు.