నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కోడేరులో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లోయలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయకచర్యలు చేపట్టారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. పది మందికి తీవ్రంగా గాయాలయ్యాయని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
ప్రమాద సమయంలో వాహనంలో 45 మంది ఉన్నారని తెలిపారు. ఓవర్ లోడ్, మితిమీరిన వేగం కారణంగా ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. బాధితులు మహాసముద్రం, కోడేరు గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్లో కూలిన మరో బ్రిడ్జి..
ఎన్డీయే పాలిత బీహార్ (Bihar)లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న (Bridge Collapses) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా నాలుగు బ్రిడ్జిలు కూలిపోయిన విషయం తెలిసిందే. గురువారం కిషన్బాగ్ జిల్లాలో, జూన్ 23న తూర్పు చంపారన్ జిల్లాలో, 22న సిశాన్లో, 19న అరారియాలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలింది. శుక్రవారం మధుబని (Madhubani) ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.
దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో 75 మీటర్ల పొడవైన ఈ వంతెనను బీహార్ గ్రామీణ పనుల విభాగం 2021 నుంచి నిర్మిస్తోంది. ఇది మధుబని – సుపాల్ జిల్లాల మధ్య భూతాహి నదిపై ఉంది. అయితే, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూతాహి నదిలో నీటి మట్టం పెరిగింది. నీటి ఉద్ధృతికి నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, రాష్ట్రంలో గత తొమ్మిది రోజుల వ్యవధిలోనే ఇది ఐదో ఘటన (fifth incident) కావడం గమనార్హం. దీంతో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.