Mahalakshmi Scheme | గంగాధర, జూన్ 27: కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్త విధానాలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతన్నారు. మహాలక్ష్మీ స్కీం తెచ్చి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం.. ట్రిప్పులు తగ్గించి విద్యార్థులను ఇక్కట్ల పాలు చేస్తున్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం న్యాలకొండపల్లి శివారులోని మాడల్ స్కూల్లో సుమారు 750 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి దాకా రెండు ట్రిప్పులు నడిచిన బస్సును.. ఇప్పుడు ఒక ట్రిప్పు తగ్గించడంతో ఒకే ట్రిప్పులో సుమారు 130 మంది దాకా స్కూల్కు వెళ్తున్నారు. బస్సు కిక్కిరిసిపోవడంతో ఊపిరి కూడా ఆడటం లేదని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికెళ్లి హోంవర్క్ కూడా పూర్తిచేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులు, ట్రిప్పుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.