Uttar Pradesh | లక్నో : ఉత్తరప్రదేశ్ హథ్రాస్ జిల్లాలోని రతిభాన్పూర్లో నిర్వహించిన శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 107కు చేరింది. పలువురు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని యూపీ పోలీసులు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రతిభాన్పూర్లో మంగళవారం మధ్యాహ్నం భోలా బాబా ఆధ్వర్యంలో శివ ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తండోపతండాలుగా తరలివచ్చారు. ఇక ఆరాధన కార్యక్రమం ముగియగానే.. బయటకు వచ్చేందుకు భక్తులు పరుగులు పెట్టారు. అక్కడ చిన్న గేటు ఉండడంతో ఒకేసారి అందరూ పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో మొదట 27 మందికి పైగా మరణించారు. మొత్తంగా మంగళవారం రాత్రి వరకు ఆ సంఖ్య 107కు చేరుకుంది. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. ఎటా ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ఇతర ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. శివ ఆరాధన కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బయటకు వచ్చేందుకు దారి ఒక్కటే ఉంది. అది కూడా చిన్న గేటు. దాంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ఒకేసారి అందరూ ప్రయత్నించారు. గేటు బయటనే బైక్లు పార్క్ చేయడం మరింత ఇబ్బందిగా మారింది. మొత్తంగా దారి మూసుకుపోయింది. దీంతో తొక్కిసలాట జరిగింది అని సదరు వ్యక్తి తెలిపాడు.
ఈ తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. రతిభాన్పూర్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ప్రాథమిక విచారణలో తేలింది.