గిరిజన తండాలో కళ్లెదుట కనిపించే శ్రమజీవులు. అరుదైన సంస్కృతి, సంప్రదాయ వైభవం. ఘనమైన వారసత్వంగా వస్తున్న ఆచార, వ్యవహారాలు. వీటన్నిటినీ సునిశితంగా పరిశీలిస్తూ పెరిగాడు ఆ కుర్రాడు. తన మనసులో దాచుకున్న భావాలకు చిన్నప్పటినుంచే అక్షర రూపమిచ్చాడు. తల్లిదండ్రులు, గురువులు వెన్నుతట్టడంతో పట్టిన కలాన్ని మరింత మచ్చిక చేసుకున్నాడు. నూనూగు మీసాల వయసులోనే తలపండిన పెద్దలు మెచ్చే రచనలు చేశాడు. ఆ యువ సాహితీవేత్త రమేశ్ కార్తీక్ నాయక్. గిరిజన జీవిత గాథలపై ఆయన రాసిన ‘ఢావ్లో’ (విషాద గీతం) రచనకు గానూ ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యాడు. తెలుగు రాష్ర్టాల్లో 26 ఏండ్ల పిన్న వయసులో ఇంతటి ఘనమైన పురస్కారాన్ని అందుకున్న రమేశ్ కార్తీక్ నాయక్పై ప్రస్థానమిది..
బడిలో టీచర్లు పాఠాలు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినేవాడు కార్తీక్. ఖాళీ సమయం దొరికితే.. తన మనసులో భావాలన్నీ కవితలుగా రాసేవాడు. ఆ విద్యార్థి నైపుణ్యాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు అతణ్ని ‘అక్షర సేద్యం’ వైపు నడిపించారు. తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం వివేక్నగర్ తండా కార్తీక్ స్వగ్రామం. తల్లిదండ్రులు సేవంతాబాయి, నునావత్ మోజీరాం. సాధారణ వ్యవసాయ కుటుంబం. రమేశ్ కార్తీక్ నాయక్ అసలు పేరు నునావత్ కార్తీక్. తెలుగు, ఇంగ్లిష్లో కథలు, వచన కవిత్వం, అనువాదం వంటి విభాగాల్లో చిన్నప్పటినుంచే ప్రతిభ కనబరిచేవాడు. పదో తరగతి నుంచే కవిత్వం రాయడం అలవాటుగా మలుచుకున్నాడు. గిరిజనుల జీవితాలు, మనస్తత్వాలు, కష్టసుఖాలను కవిత్వం, కథలుగా మలిచి ఎందరినో ఆకట్టుకున్నాడు.
చదువులో రాణిస్తూనే కార్తీక్ రచనలను కొనసాగించేవాడు. ఐదో తరగతి దాకా స్థానికంగా చదివాడు. తర్వాత బోధన్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి పూర్తిచేశాడు. తర్వాత మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిప్లొమాలో చేరాడు. అది పూర్తి కాకుండానే డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో బీఏ పూర్తిచేశాడు. కూకట్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రైవేటుగా ఇంటర్ చదివాడు. ఎంఎన్ఆర్ కళాశాలలో డీఎడ్ చదివాడు. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో స్పానిష్ భాష డిప్లొమాలో చేరాడు. ఆర్థిక కారణాల వల్ల రెండో ఏడాది కొనసాగించలేకపోయాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ ఎంఏ పూర్తిచేశాడు. ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పనిచేశాడు. ప్రస్తుతం ఓయూలో ఎంఏ తెలుగు చదువుతున్నాడు. మరోవైపు దూరదర్శన్లో ‘అక్షరం’ అనే సాహిత్య కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
కార్తీక్ నాయక్ 2014లో మొదటి కవితా సంపుటిని వెలువరించాడు. నాటి నుంచి ఆయన అక్షర సేద్యం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నది. ఆయన రచనలు ఒక్కోటి ఒక్కో ప్రాధాన్యంతో ప్రజాదరణ పొందాయి. కార్తీక్ రాసిన మొదటి కవితా సంపుటి ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మలయాళం, బంగ్లా భాషల్లోకి అనువాదమైంది. 2018లో రాసిన ‘బల్దేర్ బండి’ వచన కవితా సంపుటి సాహితీప్రియులను ఆకట్టుకుంది. 2021లో ‘ఢావ్లో’ పేరుతో తీసుకొచ్చిన కథల సంపుటిలో గోర్ బంజారా కథలను అద్భుతంగా అక్షరీకరించాడు. తండావాసుల కష్టసుఖాలను, ఆచార వ్యవహారాలను ఇందులో కండ్లకు కట్టాడు. ఇందులోని ‘పురుడు’ కథ ఆంగ్లంలోకి అనువాదమై ‘ఎక్సేంజెస్’ సాహిత్యానువాద జర్నల్లోనూ ప్రచురితమైంది. 2022లో ఆచార్య సూర్య ధనుంజయతో కలిసి సహ సంపాదకీయంలో ‘కేసులా’ పేరుతో గోర్ బంజారా కథలు రాశాడు. 2023లో ‘చక్మక్’ శీర్షికతో ఇంగ్లిష్ కవితా సంపుటి రచించాడు. ఈ యువ సాహితీవేత్త అక్షర సేవలకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కగా, అంతకుముందే 2017లో కలహంస పురస్కారం, 2018లో తెలంగాణ రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం (బోధన్లో), 2019లో మువ్వా రంగయ్య ఫౌండేషన్ వారి నవ స్వరాంజలి సత్కారం, 2019లోనే చిలకమర్తి లక్ష్మీనరసింహం సాహితీ పురస్కారం ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ‘బల్దేర్ బండి’ సంపుటిలోని జారేర్ బాటి (జొన్న రొట్టెలు) కవిత కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ తెలుగు పాఠ్య పుస్తకంలో చోటు దక్కించుకుంది. ఇదే సంపుటిలోని పలు కవితలు ఆంధ్ర విశ్వవిద్యాయం పీజీ తెలుగు పాఠ్యాంశంలోనూ చేర్చడం విశేషం. తండాలో పూసిన ఈ కవితా సింగిడి మరిన్ని అద్భుతాలు చేయాలని ఆశిద్దాం.
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉంది. 26 ఏళ్ల వయసులో ఈ ఘనతను సాధించడం గొప్పగా ఉంది. గిరిజనులతో ఏమవుతుందిలే అనుకున్న వారికి ఈ అవార్డుతో సమాధానం దొరుకుతుంది. నేను పుట్టి పెరిగిన వాతావరణం, మా గిరిజనుల శ్రమైక జీవనం ఆధారంగా నేను రచించిన కవితలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయని బలంగా నమ్ముతా. చిన్నప్పటినుంచి కళ్లెదుట కనిపించిన వాస్తవిక ఘటనలను నా రచనల్లో పొందుపర్చాను. సమాజంలో అందరికీ ఉపయోగపడే సాహిత్యాన్ని అందించి నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడమే నా లక్ష్యం.