ఏ నాగరికతను సృష్టించినా మానవుని దృష్టి యావత్తూ పరిసర ప్రకృతిమీదికే వ్యాపించుతున్నది. కట్టెదుట కనిపించుతున్న తాత్కాలిక సమస్యలను మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నాము. తాత్కాలికంగా ఏర్పడ్డ ఆ బాధలకు పరిష్కారం చూసుకోగలిగితే శాంతిగా యీ గడ్డమీద నిలబడగల ననుకుంటున్నాడు. కాని అలాంటి సమస్యలన్నీ ప్రభవించటానికి మూలకారకుడైన తనను గురించి తాను అణుమాత్రమైనా ఆత్మశోధన చేసుకోడు. అందుచేత, యుగ యుగాలుగా ఎన్నెన్ని తాత్కాలిక బాహ్యసమస్యలు పరిష్కారం చేసుకున్నా, “మానవుడు” పరిష్కారం కాని అనాది సమస్యగా ఇంకా అలానే మిగిలివున్నాడు. నిరంతరం, భయంకరమైన అనేక సమస్యా పరంపరలు ప్రభవించటానికి కారణభూతుడవుతున్నాడు.
మానవునిలో అణచరాని సహజావేశాలు ఎన్నో వున్నయ్. అవన్నీ మానవుడు పెంపొందటానికి అవసరమైనవే. అవన్నీ మానవునిలోని అమరమైన జీవశక్తికి చిహ్నాలు. వాటిని అణచివేయటం యెన్నటికీ సాధ్యంకాదు. బలవంతాన అలాంటి ఆవేశాలను అణచివేయటానికి మూర్ఖంగా యెప్పుడు ప్రయత్నించుతామో ఆ మరుక్షణంలో మానవుడు మానవత్వాన్ని ఒక తాపుతన్ని తిరిగి మృగధర్మంలోకి పరారి అవుతాడు. రాక్షసరూపంలో విజృంభించి, వెనకా ముందూ యోచించకుండా అనంతమైన హింసాకాండకూ, విధ్వంసానికీ పూనుకుంటాడు. నాటికి పెంపొందివున్న సాంఘిక వ్యవస్థనూ, నాగరికతనూ చూస్తే అతనికి జంతుహత్యలకు ఏర్పడ్డ కబేళాలాగానూ, కత్తుల నరకంగానూ కనిపించుతుంది. ప్రళయరుద్రుడిలా విజృంభించి వాటినన్నిటినీ కూలదోసి లాకుమట్టం చేసేస్తాడు.
మానవ జీవితంలో ఆకలి వుంది, కామం వుంది, ఈర్ష్య వుంది, క్రోధం వుంది, దుఃఖం వుంది, సుఖవాంఛ వుంది ఇవి మానవునితోపాటు పుట్టిన సహజ గుణాలు. ఇవి అణచుకుంటే ఆగేవికావు. వీటిని అణచుకోమని కాకిశోషగా యెన్ని ధర్మపన్నాలు వాగినా ఆవంతైనా ప్రయోజనం వుండదు. ఆకలిదప్పులు తీరాలి, కామవాంఛలు తీరాలి, తోటి మానవునితోపాటు తనకూ న్యాయం జరుగుతోందనే ఆత్మతృప్తి ఏర్పడాలి. నలుగురితోపాటు తనకూ సుఖశాంతులున్నాయనే పరితృప్తితో దుఃఖోపశమనం కలగాలి. అంతవరదాకా ఈ భూగోళం మీద శాంతి సిద్ధించుతుందనుకోవటం పిచ్చివాడి కలవరింపు.