మాకు చిన్నప్పుడు తెలుగు నేర్పింది అమ్మే! ఎన్నో పదాలకు అర్థాలు, పురాణాల్లో ఘట్టాలు, సామెతలు, చాటువులు, పిట్ట కథలు, జాతీయాలు, నుడికారాలు, పద్యాలు తెలిశాయంటే అమ్మ వల్లనే! మేము ఒకటో తరగతిలో ఉన్నప్పుడు మాకు తెలుగు ఎలా నేర్పేదో.. పదో తరగతి తెలుగు కూడా అంతే సులభంగా బోధించగలిగేది అమ్మ.
రాత్రి పడుకునే ముందు అమ్మ మాకు రకరకాల కథలు చెప్పేది. అవి మా నానమ్మ చెప్పేలాంటి కథలు కావు. చాలా తెలివిగా, సమయస్ఫూర్తితో ఎలా నడుచుకోవాలో తెలిపే కథలు! మంచి ప్రవర్తన, పెద్దలపట్ల మర్యాద, అబద్ధాలు చెప్పకపోవడం, వినయం, సంస్కారం నేర్పే కథలు. అమ్మకు ఎన్నో పద్యాలు కూడా వచ్చేవి.
తాజ్ మహల్ సౌందర్యాన్ని వర్ణిస్తూ.. “రాణి విడిచిపోయె రాజునొంటరి జేసి రాజు విడిచి పోయె రాజ్యరమను రాజ్యరమయు విడిచె రాజుల పెక్కండ్రుతాజు వి డువలేదు రాజసమును” అనే పద్యం చెప్పేది.
పూర్వకాలంలో మామూలు ఆడవాళ్లు కూడా ఇలా పద్యరూపంలో మాట్లాడుకునేవారని చెబుతూ.. “మంచివి కుంచెడు శనగలు మంచములో ఎండబెట్టి మరచితినక్కా.. అంతట వర్షము వచ్చెను. కుంచములో చూతునక్క పిల్లి కూనల పెట్టెన్”.. “కాకరకేటికి ఉదకము చేకొని ఓ కొమ్మ నిమ్మ చెట్టుకు పోయుము కాకర పూవులు పూయును నిమ్మ కాయలు కాచున్” ఇలాంటి ఉదాహరణలు చెప్పేది.
కొన్నిసార్లు మాకు సమస్యాపూరణం ఇచ్చి పూరించమనేది. అది పూరిస్తే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి మైసూర్పాక్ గానీ గులాబ్ జామూన్ గానీ చేసి పెడతాననేది. ఇంటి పాలకోవాతో చేసిన ఆ గులాబ్ జామూన్ను తలచుకుంటూ.. మేము బడి నుంచి ఇంటికొచ్చే దారిలో దాన్ని గురించే ఆలోచించేవాళ్లం. ఎంత ఆలోచించినా మా మట్టిబుర్రలకు ఏమీ తోచేది కాదు. మా స్నేహితులకైతే ఆ విషయం అర్థమయ్యేదే కాదు. “ఎట్లనే రమా! నీకే రాకుంటె మాకెట్ల ఒస్తదే?!” అనేవాళ్లు. “ఇలలో ఇద్దరు రాజులు మలయుచు చదరంగమాడ మాపటి వేళన్ బలమెత్త మరచిపోయిరి ఎలుకలు తమ కలుగులోకి ఏనుగునీడ్చెన్”.. లాంటి సమస్యా పూరణ ఇచ్చినప్పుడు సాయంత్రం కాదు, రెండురోజులైనా మేము చెప్పలేక పోయేవాళ్లం. స్వీట్ అయితే ఇచ్చేదిగానీ ఓ మూడు రోజులాగి అమ్మ జవాబు చెప్పేది. ఇద్దరు రాజులు చదరంగం ఆడాక.. పావులను తీసి సర్దిపెట్టకుండా, అలాగే వదిలేసి పోతే.. ఆ గదిలో ఉన్న ఎలుకలు చదరంగం ఆటలోని ఏనుగును తమ కలుగులోకి ఎత్తుకుపోయాయట. ఇది తెలిశాక.. “ఓ! గింతేనా!” అనేవాళ్లం. “మరి ముందే ఎందుకు చెప్పలేదు?!” అని అమ్మ నవ్వేది. ఇలాంటివి అమ్మ నోటివెంట కోకొల్లలుగా వచ్చేవి.
అమ్మకు హిందీ కూడా బాగా తెలిసేది. “ఏక్ కవ్వా ప్యాసా థా. జగ్ మే థోడా పానీ థా. కవ్వా లాయా పథ్తర్. పానీ ఆయా ఊపర్. కవ్వా పియా పానీ.. హో గయీ కహానీ!” అన్న హిందీ పద్యం చదివేటప్పుడు మేము పెద్దగా బట్టీ పట్టేవాళ్లం. అది చూసి అమ్మ నవ్వి.. “ఎందుకట్ల ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టు చదువుతున్నరు?! ఏదైనా బట్టీ పట్టొద్దు. మనసుకు పట్టిచ్చుకొని చదివితె ఒస్తది. మళ్ల ఎన్నడు మర్చిపోరు. దీనికి మీరు ఇంతకు ముందు చదివిన ‘కాకి ఒకటి నీళ్లకు కావు కావుమనుచును’ పద్యం యాదికి చేసుకోండి.. హిందీ అదే వస్తుంది” అని చెప్పేది అమ్మ.
“నాకు హిందీ ఒస్తలేదు” అని అక్కో, నేనో ఎప్పుడైనా అంటే.. “మీకు తెలుగు మాత్రం బాగ ఒస్తదా?! ఏదీ.. దీనికి అర్థం చెప్పండి!” అని ఒక పొడుపుకథ వేసేది అమ్మ. మేము దానికి జవాబు చెప్పలేక దిక్కులు చూసేవాళ్లం. కొంచెంసేపు మమ్మల్ని ఆలోచించనిచ్చి, ఆ జవాబు చెప్పేది తను. ఇంకొక సూత్రం కూడా మాకు అమ్మే చెప్పింది. “హిందీ ఏం కష్టం కాదు. తెలుగు మంచిగ ఒస్తే.. హిందీ అదే ఒస్తది. శానా తెలుగు పదాలకు ‘డుమువులు’ తీసేస్తె హిందీ పదాలైతవి” అనేది. మేము వెంటనే రంగంలోకి దూకి.. ‘రాముడు-రామ్, ఆకాశము-ఆకాశ్, గురువు-గురు..’ ఇట్లా పదాలు వెతుక్కుంటుండేవాళ్లం. సంస్కృత శ్లోకాల్లోంచి కొన్ని మంచివి ఎంచుకుని వాటి సందర్భం తెలుగులో చెబుతూ ఉండేది. అమ్మ నేర్పే విధానం అంత బాగా ఉండేది.
పైతరగతుల్లో మా సార్లు కూడా బాగా చెప్పేవారు కనుక.. అమ్మను ఎక్కువగా అడిగే అవసరం రాకపోయేది. కానీ, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, భారత స్వాతంత్య్ర చరిత్ర వంటి వాటిలో ఘట్టాలు పాఠాలుగా మేము చదువుకుంటున్నప్పుడు వాటి ముందు, వెనుక జరిగిన సంఘటనలను అమ్మే వివరించి చెప్పేది. తరువాతి రోజుల్లో పత్రికల్లో వచ్చే కథలు, నవలల్లో పాత్రల చిత్రీకరణ, శైలి, సంభాషణలు, సన్నివేశ కల్పన, వర్ణనలు.. వీటన్నిటి గురించి అమ్మ మాతో చర్చిస్తూ ఉండేది. ఆ క్రమం లో తెలుగు భాషపై ఇష్టం, సాహిత్యమంటే మక్కువా ఏర్పడ్డాయి మాకు.